హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి స్పెషల్డ్రైవ్లో భాగంగా శుక్ర, శనివారాల్లో టీకాలు వేస్తున్నదని గుర్తుచేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్, బషీర్బాగ్ ప్రెస్క్లబ్, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యునానీ దవాఖాన, వనస్థలిపురం ఏరియా దవాఖానలను ప్రత్యేక కేంద్రాలుగా కేటాయించినట్టు తెలిపారు. అక్రెడిటేటెడ్ జర్నలిస్టుతోపాటు అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులు కూడా తమ సంస్థ గుర్తింపుకార్డులతో టీకాలు తీసుకోవచ్చని తెలిపారు. జిల్లా,మండలస్థాయిలో కూడా జర్నలిస్టులకు టీకాలు ఇస్తున్నారని, సమాచార పౌర సంబంధాలశాఖ అధికారుల సమన్వయంతో స్పెషల్డ్రైవ్ సాగుతున్నదని తెలిపారు.
బషీర్బాగ్ ప్రెస్క్లబ్లోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్రెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఏ రాజేష్, హెచ్యూజే కార్యదర్శి శిగ శంకర్గౌడ్ తదితరులు పర్యవేక్షించారు.