న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా బాధితులు మరణించారు. దేశంలో మొదటిసారిగా శనివారం నాలుగు వేలకుపైగా మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. కాగా, రోజువారీ కేసులు వరుసగా నాలుగో రోజూ నాలుగు లక్షలు దాటాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్లకు చేరువలో నిలిచాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 4,092 మంది వైరస్ వల్ల కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,22,96,414కు చేరగా, మృతులు 2,42,362కు పెరిగారు. మరో 1,83,17,404 బాధితులు కరోనానుంచి కోలుకోగా, 37,36,648 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్తగా 3,86,444 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 16,94,39,663 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
ఇక కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 53,605 కేసులు ఉండగా, కర్ణాటకలో 47,563, కేరళలో 41,971 చొప్పున ఉన్నాయి. నిన్న ఒకేరోజు మరఠ్వాడలో 864 మంది కరోనాకు బలికాగా, కర్ణాటకలో 482 మంది, ఢిల్లీలో 332 మంది చనిపోయారు.
శనివారం ఒక్కరోజే 18,65,428 మందికి కరోనా పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో మే 8 వరకు మొత్తం 30,22,75,471 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి