గత ఏడాది భారీ వర్షాలకు తెగిన సింగారం చెరువు కట్ట
అధికారులకు స్థానిక రైతుల వినతి
మొయినాబాద్, మార్చి29: ఆ చెరువు కట్ట కింద వందల ఎకరాలు ఆయకట్టు ఉంది. సుమారుగా 30 ఏండ్ల క్రితం బోరుబావులు లేని సమయంలో చెరువుకు దిగువ భాగాన ఉన్న రైతులు చెరువు ద్వారా వచ్చిన నీళ్లతో పంటలు సాగు చేసుకునే వారు. కాలక్రమేణ బోరు బావులు వచ్చిన నేపథ్యం లో రైతులు చెరువు నీళ్లపై ఆధారపడకుండా పంటలు సాగు చేస్తున్నారు. కొందరు చెరువులోని భూములను కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టడంతో వర్షాకాలంలో చెరువులోనికి వచ్చి నీటిని ఎప్పటికప్పుడు దిగువ భాగానికి వదులుతున్నారు. గత పది ఏండ్లలో చెరువు కట్ట రెండు సార్లు తెగిపోయింది. గత ఏడాది భారీగా కురిసిన వర్షాలకు చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో చెరువు కట్ట తెగింది.
మొయినాబాద్ మండల పరిధిలోని కాశీంబౌలి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామ మైన నజీబ్నగర్ గ్రామ రెవెన్యూలో సింగారం చెరువును వందల ఏండ్ల క్రితం నిర్మించారు. చెరువు కింద ఆయకట్టు సుమారుగా వంద ఎకరాలు ఉంది. పూర్వ కాలంలో రైతులు చెరువు ద్వారా వచ్చే నీటి ద్వారా పంటలు సాగు చేసే వారు. చెరువు కింద ఉన్న నజీబ్నగర్, కాశీంబౌలి, అమ్డాపూర్, బాకారం గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న భూములకు సాగు నీరు అందేది. కాని అలాంటి చెరువు నేడు పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. గత వర్షాకాలంలో చెరువు కట్ట తెగి వందల ఎకరా ల్లో పంట నష్టం జరిగింది. చెరువులోకి భారీగా వరద నీళ్లు రావడంతో కట్ట తెగి వరద నీరు పూర్తిగా దిగువ ప్రాంతానికి వెళ్లి పోయింది. గత పదిహేను ఏండ్ల క్రితం తెగిన చోట కట్ట నిర్మాణం నాణ్యతతో ఏర్పాటు చేయక పోవడంతో మళ్లీ అదే చోట తెగింది. కట్ట తెగి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు అధికారులు పునరుద్ధరించ లేదు. చెరువు కట్టను పునరుద్ధరించాలని ఆయకట్టు ప్రాంత రైతులు వేడుకుంటున్నారు. సింగారం చెరువులో నీళ్లు నిల్వ ఉండటం వలన చెరువు కింద గ్రామాలతో పాటు చెరువు చుట్టూ ఉన్న గ్రామాల్లో భూగర్బ జలాలు పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి