సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
సుబేదారి, జూలై 2: కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచి పేద, సామాన్యులపై పెనుభారం మోపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రెండు నెలల్లోనే 36 సార్లు చమురు ధరలు పెంచి ప్రజల రక్తం తాగుతున్నదని మండిపడ్డారు. చమురు కంపెనీలతో ప్రధాని మోదీ చేతులు కలిపి ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. ఈ ధరల వల్ల రవాణా రంగంలో, నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి రూ.25 పెంచిన కేంద్రం నిలువు దోపిడీ చేస్తుందని విమర్శించారు. చమురు ధరల మంటల్లో మోదీ ప్రభుత్వం కాలిపోక తప్పదని హెచ్చరించారు.