నల్లగొండ : తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నది జలాలకు సంభందించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కేంద్రం కుట్ర పన్నిందన్నారు. నిజాం రాజులు కట్టిన మూసి, డిండి ప్రాజెక్టులను కూడా గెజిట్ లో పొందుపరచడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలకు రాష్ట్రం మీద ప్రేమ లేదని, కేవలం అధికారం మీద యవతోనే రాష్ట్రానికి అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రానికి తెలియకుండా ఒక్క చుక్క నీటిని వినియోగించుకునే వీలు లేకుండా కుట్ర చేసిందన్నారు. తెలంగాణ నాయకుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని, అప్పటి పాలకులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ నాయకుల నోళ్లు మూయించారన్నారు. సీఎం కేసీఆర్ కొత్త ప్రాజెక్టులను, రన్నింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఇది చూసి ఓర్వలేక బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తెలిసే ఈ విధంగా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేయాలన్నా కేంద్రం దాయాదాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పదన్నారు. తెలంగాణ బాగుకోరే ఎవ్వరు ఈ గెజిట్ను ఒప్పుకోరన్నారు. బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై బీజేపీ వాళ్లకు చిత్తశుద్ధి, ప్రేమ లేదని, అధికారం కోసమే వారి ఆరాటమన్నారు. కేంద్రం పునరాలోచన చేసి గెజిట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం పట్ల బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.