కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలని తెలంగాణ కేంద్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సంఘం కన్వీనర్ వీ దానకర్ణాచారి పిలుపునిచ్చారు. అత్యంత కీలకమైన బీమా, రక్షణ రంగాలను కూడా ప్రైవేటుపరం చేస్తూ కేంద్రప్రభుత్వం దేశ భద్రత, ప్రజల పొదుపు సొమ్మును ప్రమాదంలో పడేస్తున్నదని ఆరోపించారు. గత బడ్జెట్లో కార్పొరేట్ కంపెనీలకు రూ.1.15 లక్షల కోట్ల రాయితీలు ప్రకటించి, ఇప్పుడు ఆ లోటును పూడ్చుకొనేందుకు ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నదని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ప్రజల సొమ్ముతో నెలకొల్పిన వైజాగ్ స్టీల్ ప్లాంట్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, బీఈఎంఎల్, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ వంటి సంస్థలను అంబానీ, అదానీ, టాటా, ఎల్ అండ్ టీ వంటి సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నదని, దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు రిజర్వేషన్లు కూడా అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తంచేశారు.