నల్లగొండ, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ పట్ల కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆది నుంచే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, సీలేరు పవర్ ప్లాంట్ను ఏకపక్షంగా ఏపీలో కలిపి అన్యాయం చేసిందని గుర్తుచేశారు. ఆనాడు మొదలైన కుట్రల పర్వం తాజాగా కృష్ణా, గోదావరి జలాల గెజిట్ నోటిఫికేషన్ వరకు కొనసాగుతూనే ఉన్నదని మండిపడ్డారు. ఈ గెజిట్ను అమలు చేయడమంటే రాష్ర్టాన్ని తిరిగి కరువు పరిస్థితుల్లోకి నెట్టడమేనని, దీన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం గుత్తా మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అస్థిరపర్చాలనే దుర్బుద్ధితో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడ్తుంటే.. నీళ్లపై పెత్తనాన్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడం దారుణమని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించిన మూసీ, డిండి వంటి మధ్యతరహా ప్రాజెక్టులను సైతం గెజిట్లో చేర్చడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం నిర్ణయంతో ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ వాటా నీళ్లను రాష్ట్రం వాడుకునేదని, నాడు సమైక్య పాలకులు వీటిని పట్టించుకోలేదన్నారు. అదే సమయంలో ఏపీ వైపు ప్రాజెక్టులను పూర్తి చేసుకుని నీటిని వాడుకుంటున్నారని గుర్తుచేశారు.
రాష్ట్రం బాగుపడటం కేంద్రంకు నచ్చట్లేదు
సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్ర నీటి వాటాను సద్వినియోగం చేసుకోవాలని పనిచేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలకు గిట్టడం లేదని గుత్తా విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదన్న దురుద్దేశంతోనే కేంద్రం కక్షపూరిత చర్యలకు పూనుకున్నదని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలో పరిష్కరించాల్సినవి చాలా ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా నదీ జలాలపై మాత్రం ఆగమేఘాల మీద స్పందించడంలో అర్థమేంటని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సస్యశ్యామలమై ప్రజలు బాగుండటం ఇష్టంలేని కేంద్రం కావాలనే అడ్డంకులు సృష్టిస్తుందని ఉద్ఘాటించారు. ఆరు నెలల్లోపు అన్ని ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవాలనడంలో ఆంతర్యమేంటని, అనుమతులు ఇచ్చేది కేంద్రమా.. కాదా? అని నిలదీశారు. ఎప్పుడో పూర్తయిన ప్రాజెక్టులకు నీళ్లు కావాలన్నా.. ఇక ముందు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పెద్ద పెద్ద మాటలు మాని రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. ఓవైపు తెలంగాణకు నష్టంచేసే చర్యలకు పాల్పడుతూనే మరోవైపు టీఆర్ఎస్పై ఎదురుదాడి చర్యలను తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు రాష్ట్రంపై ప్రేమలేదని, వారికున్నది అధికారంపై యావ మాత్రమేనని చెప్పారు. గెజిట్పై కేంద్రం పునరాలోచన చేసేవిధంగా బీజేపీ నేతలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కృష్ణా, గోదావరి రివర్ బోర్డులను తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న కేంద్రం తీరుపై పార్లమెంట్లో కొట్లాడేందుకు టీఆర్ఎస్ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని, మిగతా ఎంపీలు వారితో కలిసి తమ గళాన్ని వినిపించాలని సూచించారు.