దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. వ్యాక్సిన్ హబ్ అయిన భారత్లోనే టీకా కొరత దురదృష్టకరం. టీకాల విషయంలో మనకంటే చిన్నదేశాలు ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తే.. కేంద్ర ప్రభుత్వం వద్ద నేటికీ సరైన వ్యూహం లేదు. వారి వాలకం చూస్తుంటే తొందర అవసరం లేదన్న భావనలో ఉన్నట్టు కన్పిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో 18-45 ఏండ్ల మధ్య వయస్సు వారందరికీ వ్యాక్సినేషన్ ఇప్పట్లో సాధ్యమవుతుందా అనే సందేహం కలుగుతున్నది.
ఆస్క్కేటీఆర్లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిని కట్టడిచేయాలంటే వ్యాక్సినేషనే సరైన మార్గం.. కానీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. రాష్ర్టాలకు టీకాల పంపిణీ, వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పటికీ కేంద్రం వద్ద సరైన వ్యూహం లేదని విమర్శించారు. చిన్న దేశాలు సైతం ఎంతో ముందుగా మేల్కొంటే.. వ్యాక్సిన్ హబ్గా ఉన్న భారత్లోనే ఇలాంటి దుస్థితి ఉండటం దురదృష్టకరమని విచారం వ్యక్తంచేశారు. గ్లోబల్ టెండర్లకు వెళ్లకుండా.. ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా రాష్ర్టాలు కొనుగోలు చేయకుండా కేంద్రం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆదివారం ట్విట్టర్లో ‘ఆస్క్కేటీఆర్’ పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
టీకా కేటాయింపులో తెలంగాణపై వివక్ష ఉన్నదా? వ్యాక్సినేషన్పై కేంద్రానికి వ్యూహమంటూ ఉన్నదా?
రాష్ర్టాలకు అవసరమైన స్థాయిలో కేంద్రం వద్ద వ్యాక్సిన్ డోసులు లేవు. వారి వాలకం చూస్తుంటే వ్యాక్సిన్ విషయంలో తొందర అవసరం లేదనే భావన కలుగుతున్నది. కరోనా విపత్కర పరిస్థితి నుంచి బయటపడే ఏకైకమార్గం వ్యాక్సినేషన్ అనే విషయంపైనా వారికి స్పష్టమైన వ్యూహం లేదు. నేరుగా టీకా ఉత్పత్తిదారులను రాష్ర్టాలు సంప్రదిస్తే.. ఒక్క కేంద్రంతోనే ఒప్పందం చేసుకుంటామని అవి స్పష్టంగా చెప్తున్నాయి. కానీ, దురదృష్టవశాత్తు కేంద్ర మాత్రం గ్లోబల్ ప్రొక్యూర్మెంట్కు వెళ్లడం లేదు.
వ్యాక్సిన్ హబ్లోనే టీకా కొరత ఎందుకు?
దీనిపై అనేక సందేహాలున్నాయి. వ్యాక్సిన్ల సమీకరణలో అన్నిదేశాలు ముందుగానే మేల్కొని ఆర్డర్లు ఇస్తే.. భారత్ మాత్రం ఈ ఏడాది జనవరిలో ఆర్డర్ ఇచ్చింది. గతేడాది మేలోనే అమెరికా 300 మిలియన్ డోసుల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ డోసులను సేకరించింది. నార్వే, డెన్మార్క్, కెనడా దేశాలు కూడా పెద్దమొత్తంలో ఆర్డర్ చేశాయి. ఇందులో కెనడా ముందుస్థానంలో ఉన్నది. ఆ దేశం సగటున ఒక వ్యక్తికి 9 డోసుల చొప్పున టీకాలను కొనుగోలు చేసింది.
కరోనా వ్యాక్సిన్ ఎక్కడా?
కేంద్రాన్ని అడగండి. కేంద్రమే ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది. వ్యాక్సిన్ను వారే కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ఒక్క టెండరు కూడా పిలువలేదు.
అందరికీ వ్యాక్సిన్ ఎప్పుడు?
రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ పూర్తికావాలంటే ప్రతి రోజూ 10 లక్షల మందికి ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తు వ్యాక్సిన్ కొరత వల్ల అది జరుగడం లేదు. వీలైనంత తొందరల్లోనే అన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కృషిచేస్తున్నాం. పిల్లలకు వ్యాక్సినేషన్పై ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి పూర్తయిన వారికి వ్యాక్సిన్ ఇస్తాం. ఇప్పటికే ఓల్డేజ్హోంలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాం. హైదరాబాద్లో సుమారు 24 కేంద్రాల్లో ప్రారంభించాం. వ్యాక్సిన్ వృథా.. మిగతా రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో చాలా తక్కువగా ఉన్నది. సుమారు 30 లక్షల మంది హైరిస్క్ గ్రూపులను గుర్తించి వారికి వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపడుతున్నాం. వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువ రిస్క్ ఉన్నవారిని గుర్తించి వ్యాక్సినేషన్ చేస్తున్నాం.
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యం
రాష్ట్రంలో రెండోడోస్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 13.5 లక్షల మంది రెండోడోస్ తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ సొంతంగా 7.5 లక్షల డోసుల వ్యాక్సిన్ కొనుగోలు చేసింది. మరో 10 లక్షల డోసులకు ఆర్డర్ చేసింది. కానీ, వ్యాక్సిన్ లభ్యత చాలా తక్కువగా ఉన్నది. విదేశాల్లో విద్యకోసం వెళ్లే విద్యార్థులకూ వ్యాక్సినేషన్లో ప్రాధాన్యమిస్తున్నాం. వారికి ఆగస్టులో అకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుండటంతో వారంతా ఈ నెల లేదా జూలైలో విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అక్కడి వర్సిటీలు వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేశాయి.
జపాన్ 120 మిలియన్ల ఆస్ట్రాజెనికా డోసులకు ఆర్డర్ ఇచ్చింది. ఇండియా ఎందుకు ఇవ్వడం లేదు?
అమెరికా, కెనడా, డెన్మార్క్, నార్వేతోపాటు ఇతర దేశాల్లో 50 కోట్లకు పైగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు నిరుపయోగంగా ఉన్నాయి. కేంద్రం ఆ దేశాలతో చర్చలు జరిపి, వాటి కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి. వాటిని రాష్ర్టాలకు సరఫరా చేయాలి.
18-45 వయస్సు వారికి వ్యాక్సిన్ ఎప్పుడో?
మే నెల దాకా భారత్ బయోటెక్, సీరం సంస్థల వ్యాక్సిన్ కెపాసిటీ నెలకు 10 కోట్ల డోసులు మాత్రమే. ఇలాంటి సందర్భంలో దేశంలో 80 కోట్లకుపైగా ఉన్న 18-45 వయస్సుగల వారికి వ్యాక్సినేషన్ ఎలా నిర్వహిస్తారు? ఎప్పుడు పూర్తి చేస్తారో?
మనం వ్యాక్సిన్ దొరక్క ఇబ్బంది పడుతూ వేరే దేశాలకు ఎందుకు ఎగుమతి చేస్తున్నాం?
భారత ప్రభుత్వం జనవరి 2021లోనే ఇతర దేశాలు ఆర్డర్ చేసుకోడాన్ని ప్రారంభించింది. కానీ, రాష్ర్టాలను మాత్రం మే 1వ తేదీ నుంచి ఆర్డర్ పెట్టుకొనేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో పెట్టుకున్న ఆర్డర్లమేరకు ఇతర దేశాలకు వ్యాక్సిన్లు అందించాల్సి వచ్చింది. దీంతో దేశంలో తీవ్ర కొరత ఏర్పడింది.
ధరల్లో తేడా.. కేటాయింపుల్లోనూ తేడా?
ప్రైవేటు దవాఖానలకు కొవిషీల్డ్ రూ.600, కొవాగ్జిన్ రూ.1200లుగా కేంద్రం ధర నిర్ణయించింది. రాష్ర్టాలకు రూ.300, రూ.400గా నిర్ణయించింది. కేంద్రం మాత్రం రూ.150కే కొనుగోలు చేస్తున్నది. కంపెనీలు తయారుచేసే వ్యాక్సిన్లో కేంద్రం అధికశాతం తీసుకుంటూ మిగిలినవి రాష్ర్టాలు, ప్రైవేటుకు వదిలిపెడుతున్నది. ఇలాంటి పరిస్తితుల్లో వ్యాక్సిన్ లభ్యత ఎలా సాధ్యమవుతుంది? దేశ ప్రజలకు 100% వ్యాక్సినేషన్కు 272 కోట్ల డోసులు అవసరం. ఒక్క డోసు ఖరీదు రూ.150గా పేర్కొన్నారు. కేంద్రం బడ్జెట్లో వ్యాక్సినేషన్కు రూ.35వేల కోట్లు ప్రకటించింది. మరీ ఆ నిధులు ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదు.
ఆ రెండు హామీల అమలు ఎప్పుడు
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ఒక రాష్ట్రమో, ఒక సీఎం చేయాల్సింది కాదు. అంతకుమించి కేంద్రప్రభుత్వం, ప్రధానమంత్రి దేశం కోసం చర్యలు చేపట్టాలి. కరోనాపై పోరుకు ప్రధాని మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారని, ప్రపంచ బ్యాంక్ బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసిందని పలు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ను ట్యాగ్ చేయగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ… ఆ రెండు హామీలు ఎప్పుడు నెరవేరుస్తారోనని దేశం మొత్తం ఎదురుచూస్తుందని వ్యాఖ్యానించారు. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఇంకా తీసుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి వరకు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వ్యాక్సినేషన్పై అవగాహన కార్యక్రమాలు చేపడుతామని హామీ ఇచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో టీకాలు వేసేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మనం వెనుకబడి ఉండటానికి కారణమేమిటి అని ఓ నెటిజన్ అడుగగా ‘ఇక్కడ వ్యాక్సిన్ ఎలా వేస్తున్నామనే దానికన్నా ఎంతమందికి వేస్తున్నామనేది ముఖ్యం. ఇది రాష్ర్టాల మధ్య పోటీ కాదు. భారతీయులందరూ వాక్సిన్ వేసుకోవాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
వివిధ దేశాలు కొనుగోలు చేసినటీకాల వివరాలు
దేశం నెల వ్యాక్సిన్ రకం డోసుల సంఖ్య
యూకే మే 2020 ఆస్ట్రాజెనికా 90 మిలియన్లు
జులై 2020 ఫైజర్ 30 మిలియన్లు
ఆగస్టు 14 జాన్సన్ 30 మిలియన్లు
యూఎస్ జులై 2020 నోవావాక్స్ 100 మిలియన్లు
జులై ఫైజర్ 100 మిలియన్లు
ఆగస్టు 2020 జాన్సన్ 100 మిలియన్లు
ఆగస్టు 2020 మోడెర్నా 100 మిలియన్లు
ఈయూ ఆగస్టు 2020 ఆస్ట్రాజెనికా 300 మిలియన్లు
అక్టోబర్ 2020 జాన్సన్ 200 మిలియన్లు
నవంబర్ 2020 ఫైజర్ 300 మిలియన్లు
ఆస్ట్రేలియా సెప్టెంబర్ 2020 ఆస్ట్రాజెనికా 33.8 మిలియన్లు
బ్రెజిల్ ఆగస్టు 2020 ఆస్ట్రాజెనికా 90 మిలియన్లు
జర్మనీ సెప్టెంబర్ 2020 ఫైజర్ 30 మిలియన్లు
జపాన్ జులై 2020 ఫైజర్ 120 మిలియన్లు
ఆగస్టు 2020 ఆస్ట్రాజెనికా 20 మిలియన్లు
అక్టోబర్ 2020 మోడెర్నా 50 మిలియన్లు
ఇండియా జనవరి 2021 కొవిషీల్డ్ 11 మిలియన్లు
జనవరి 2021 కొవాగ్జిన్ 5.5 మిలియన్లు