హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): దొడ్డు వడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఈ వానకాలం సీజన్లోనూ దొడ్డు వడ్లు కొనడానికి తాము సిద్ధంగా లేమని పేర్కొన్నది. ఇప్పటికే తమ వద్ద మూడు నాలుగేండ్లకు సరిపడా దొడ్డు బియ్యం నిల్వలున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో తాము దొడ్డు వడ్లు కొనే అవకాశం లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ అన్ని రాష్ర్టాలకు రాసిన లేఖలో ఈ విషయాలు తెలియజేసింది. వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఆగస్టు 17న కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే అధ్యక్షతన అన్ని రాష్ర్టాల పౌరసరఫరాల శాఖ కార్యదర్శులతో ఆన్లైన్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన వివరాలను, తీసుకొన్న నిర్ణయాలను సదరు మంత్రిత్వశాఖ విడుదల చేసింది.
ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలి
దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ముఖ్యంగా నూనె గింజల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని పేర్కొంది. ఈ వానకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 500 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఇందులో అత్యధికంగా పంజాబ్ నుంచి 113 లక్షల టన్నులు, యూపీ నుంచి 46.90 లక్షల టన్నులు, ఒడిశా నుంచి 43 లక్షల టన్నులు, ఏపీ నుంచి 42 లక్షల టన్నులు, తెలంగాణ నుంచి 40 లక్షల టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఇవన్నీ సన్నాలు మాత్రమేనని కేంద్రం లేఖ ద్వారా స్పష్టమవుతున్నది.