తెలంగాణలో ఆయిల్పామ్ సాగును భారీగా పెంచాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ముందుకెళుతున్నది. 2022-23 సంవత్సరానికి కనీసం 3 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, కేంద్రం మాత్రం తెలంగాణలో 50 వేల ఎకరాల్లో సాగుకు మాత్రమే అనుతివ్వడం ఆ లక్ష్యానికి తూట్లు పొడిచినట్టేనని భావిస్తున్నారు. అనుమతికి మించి సాగుచేస్తే కేంద్రం నుంచి ఎలాంటి సబ్సిడీలు వర్తించవు. దీంతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలో ఆయిల్పామ్సాగు ప్రాధాన్య అంశంగా తీసుకున్న నేపథ్యంలో లక్ష్యానికి అనుగుణంగా అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ నిర్ణయించింది. ఆయిల్పామ్ విత్తనాలు, సాగుకు అయ్యే ఖర్చు సబ్సిడీని పెంచుతూ నిర్ణయించడం ఒక్కటే సానుకూలాంశమని అధికారులు చెపుతున్నారు. గతంలో ఒక విత్తనానికి రూ.84 సబ్సిడీ ఇవ్వగా దీనిని రూ.200కు పెంచింది. అదేవిధంగా గతంలో రైతుకు తోట నిర్వహణ కోసం ఎకరాకు రూ.4 వేలు ఇవ్వగా రూ.4200 లకు పెంచింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగును భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. ఆచరణలో మాత్రం పూర్తిగా తేలిపోయింది. సాగు ప్రణాళిక అమలులో రాష్ర్టాల మధ్య వివక్ష చూపుతున్నది. ముఖ్యంగా ఇటీవల కేంద్రం తెచ్చిన ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్పామ్’ విధానం కొన్ని రాష్ర్టాలకే అనుకూలంగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ర్టాలకు అందించే సాయంలో తీవ్ర వివక్ష చూపుతున్నది. ఈశాన్య రాష్ర్టాలకే పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకున్నది. కొత్తవిధానంలో భాగంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అస్సాం, కేరళ, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్ రాష్ర్టాల్లో ఆయిల్పామ్ సాగును విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో అస్సాం, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం రాష్ర్టాలకు ఆయిల్పామ్ సాగుకయ్యే ఖర్చులో 90:10, ఇతర రాష్ర్టాలకు 60:40 నిష్పత్తిగా నిర్ణయించింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్పామ్వంటి వినూత్న పంట సాగును దేశ వ్యాప్తంగా పెంచాలంటే అన్నిరాష్ర్టాలకు ఒకే విధమైన సహకారం అందాల్సిన అవసరం ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తొలిదశలో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ఎంత ఎక్కువ సాయం అందిస్తే అంత త్వరగా లక్ష్యాన్ని చేరుకొనే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
ఎమ్మెస్పీ లెక్కింపులోనూ భిన్నాభిప్రాయాలు
ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు తొలిసాగా మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం.. దాని లెక్కింపులో మాత్రం అశాస్త్రీయతకు చోటిస్తున్నది. ఎమ్మెస్పీ నిర్ణయంలో ఐదేండ్ల ధరలను ప్రామాణికంగా తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఆయిల్పామ్కు గత రెండేండ్ల నుంచే అధికధర పలుకుతున్నది. అంతకుముందు మూడేండ్ల ధరలను కూడా పరిగణనలోకి తీసుకున్నా ప్రస్తుత ధరల కన్నా మద్దతు ధర తక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. గత రెండేండ్ల ధరల ఆధారంగానే మద్దతుధర నిర్ణయించాలని, అప్పుడే రైతుకు లాభదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారు. మూడేండ్ల కిందటి వరకు టన్నుకు రూ.8-9 వేలు కూడా మించని ఆయిల్పామ్ ధర.. ఈ ఏడాది రూ.19వేలకు పైగా ధర పలికింది. ఈ నేపథ్యంలో గత ధరలను సగటున తీసుకుంటే మద్దతు ధర ఆశించిన స్థాయిలో ఉండదని ఆయిల్ ఫెడ్ అధికారులు అభిప్రాయపడ్డారు.