లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మ్యాచ్ తర్వాత కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్లోనూ మళ్లీ ఆ పొరపాటు చేయకూడదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లుంది. అందుకే తుది జట్టులో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో సిరాజ్ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా టూర్లో తన టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సిరాజ్.. తన బౌలింగ్తో అదరగొట్టాడు. మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి.. సిరీస్లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
బ్రిస్బేన్లో జరిగిన చివరి టెస్ట్లో ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు కూడా తీశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్లతో చారిత్రక విజయం సాధించింది. సిరాజ్ ఇప్పటి వరకూ 5 టెస్టులాడి 16 వికెట్లు తీశాడు. అయితే ఎంతో అనుభవం ఉన్న, డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించిన ఇషాంత్ స్థానంలో సిరాజ్ను తీసుకుంటారన్న వార్తలపై పలువురు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అనుభవజ్ఞుడైన ఇషాంత్ గత 2018 ఇంగ్లండ్ టూర్లో 18 వికెట్లతో ఇండియా తరఫున టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు.
అయినా సరే సిరాజ్ మాత్రం తుది జట్టులో ఉండటం ఖాయమని మేనేజ్మెంట్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ తుది జట్టులో అశ్విన్, జడేజా ఇద్దరూ ఉన్నా కూడా ఇషాంత్ను సిరాజ్తో రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఏదిఏమైనా సిరాజ్ మాత్రం తుది జట్టులో ఉంటాడు అని ఆ వర్గాలు చెప్పడం గమనార్హం. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇద్దరు స్పిన్నర్ల వ్యూహం ఫలించకపోవంతో ఇంగ్లండ్ సిరీస్లో టీమిండియా ఎలాంటి బౌలింగ్ కాంబినేషన్తో దిగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇంగ్లండ్తో తొలి టెస్ట్ ఆగస్ట్ 4న ప్రారంభమవుతుంది.