హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్లో కొవిడ్-19 కారణంగా 80 మంది విద్యుత్ ఉద్యోగులు మృతిచెందారు. 3 వేల మంది ఉద్యోగులు కరోనా పాజిటివ్ బారిన పడినట్లు టీఎస్ ట్రాన్స్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి. ప్రభాకర్ రావు శనివారం తెలిపారు. విద్యుత్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇచ్చే విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే విద్యుత్ సిబ్బందికి వ్యాక్సినేషన్ అందజేయనున్నట్లు చెప్పారు. నిమ్స్ ఆస్పత్రికి 10 వెంటిలేటర్ల కొనుగోలు నిమిత్తం రూ.70 లక్షల విలువ గల చెక్కును అందజేశారు.
రాష్ట్రంలోని అన్ని సెక్షన్లకు నిరంతరాయ విద్యుత్ అందించేందుకు ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. విధులను నిర్వర్తించేప్పుడు సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్లు చెప్పారు. సామాజిక బాధ్యతగా నిమ్స్ ఆస్పత్రికి నిధులు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కరోనా కట్టడికి వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.