న్యూఢిల్లీ: కరోనా టీకాలను తయారీ సంస్థల నుంచి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. దీని కోసం తయారీ సంస్థలు ముందస్తుగా ధరలను వెల్లడించాలని పేర్కొంది. అలాగే ఉత్పత్తి చేసిన టీకాల్లో 50 శాతం మేరకు రాష్ట్రాలకు సరఫరా చేయవచ్చని సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన రేపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశ వ్యాక్సినేషన్ విధానానికి పలు మార్పులు చేసింది. ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్ మూడో దశ స్పీడును పెంచాలని ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.
దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ అడ్డూ అదుపూ లేకుండా విజృంభిస్తున్న తరుణంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 1 నుంచి18 ఏళ్ల పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. టీకాల కొరతను అధిగమించేందుకు రాష్ట్రాలు నేరుగా తయారీ సంస్థల నుంచి బహిరంగ మార్కెట్లో వ్యాక్సిన్ల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. దీని కోసం తయారీ సంస్థలు టీకాల ధరను ముందస్తుగా ప్రకటించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, పారిశ్రామిక సంస్థలు నేరుగా టీకాలను కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్రాలకు 50 శాతం టీకాలను తయారీ సంస్థలు సరఫరా చేయాల్సి ఉంటుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ టీకా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం గతంలో పేర్కొన్నమేరకు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లు, 45 ఏండ్లుపైబడిన ప్రజలకు ఉచిత టీకా కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.