సూర్యాపేట టౌన్, జూలై 16: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పేర్కొన్నారు. రాష్ర్టాలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదని ఆక్షేపించారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించడానికి బదులు ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణాజలాల సమస్యలను పరిష్కరించడానికి బదులు అంతర్రాష్ట్ర వివాదాల నెపంతో కేంద్రం రాష్ర్టాల హక్కులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. లేని అధికారాలను సృష్టించి రాష్ర్ర్టాలను భయపెట్టేందుకు కేంద్రం ఎత్తుగడ వేస్తుందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర హక్కుల కోసం ఉద్యమిస్తామని తెలిపారు.