హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వేసవి నేపథ్యంలో పట్టణాల్లోని మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. ప్రతి శుక్రవారం ‘హరిత శుక్రవారం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని గురువారం మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లకు స్పష్టంచేశారు. మొక్క ల సంరక్షణలో భాగంగా హరిత శుక్రవారంలో ప్రజలను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పెద్దఎత్తున చేపట్టేందుకు పట్టణ, నగర శివారులను గుర్తించాలని సూచించారు. దీని కోసం నర్సరీల్లో ఆర్నమెంటల్, మెడిసినల్ మొక్కలను పెంచాలని చెప్పారు. మెడిసినల్, న్యూట్రిషనల్ ప్లాంట్లలో మునగ, అల్లనేరేడు, కరివేపాకు, తులసి, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి, జామ, ఉసిరి, సపోట, పనస, తిప్పతీగ తదితర మొక్కలను పెంచాల్సి ఉంటుందని తెలిపారు. అర్నమెంటల్ మొక్కలను ప్రతి నర్సరీలో 20 శాతం పెంచాలని ఆదేశించారు.