నాగిరెడ్డిపేట్, మే 9 : రాజ వంశీయులు నిర్మించిన శివాలయం ఆ గ్రామానికి మూలమైంది. గ్రామం పేరులో ఇమిడి చరిత్రలో నిలిచిపోయింది. నాగిరెడ్డిపేట్ మండలంలోని చీనూరు గ్రామాన్ని పూర్వం శివునూరుగా పిలిచేవారు. గ్రామానికి ఈశాన్యంలో శివాలయం ఉంది. ఇది కాకతీయులకాలంనాటి ఆలయంగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. మెదక్ జిల్లా పాప్నపేట సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చెబుతారు.
శివుడు వెలిసిన ఊరు..
ఈ ఆలయంలో శివునికి భక్తితో పూజలు చేసేవారు. గ్రామాన్ని ఆ శివుడే కాచేవాడని గ్రామానికి చెందిన పెద్దలు ఇప్పటికీ నమ్ముతారు. అందుకే శివునిపేరిట వెలిసిన ఈ గ్రామానికి ‘శివునూరు‘ (శివుని ఊరు)గా పేరువచ్చినట్లు తెలుస్తోంది.
కాలక్రమంలో చీనూరుగా..
కాలక్రమంలో శివునూరు పేరు చీనూరుగా స్థిరపడిపోయింది. తొమ్మిదో దశాబ్దంలో మాలగుట్ట ప్రాంతంలో చీనూరు గ్రామం ఉండేది. గ్రామం సమీపంలోనే మంజీరనది, మల్లన్నగుట్ట చిన్నవాగు ప్రవహిస్తుండేవి. వానకాలంలో చిన్నవాగు ప్రవహిస్తుండేది. వానకాలంలో చిన్నవాగు ఉప్పొంగడం, మంజీర నదికి వరదలు రావడంతో గ్రామం చుట్టూ నీరు చేరేది. నిజాంసాగర్ నిర్మాణం తర్వాత వరద ఉధృతి పెరిగింది. దీంతో గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించేవారు. కొద్దికాలానికి ఊరు ఖాళీ చేసి ప్రస్తుతం ఉన్న శివాలయానికి కొద్ది దూరంలో ఇండ్లు నిర్మించుకున్నారు. గ్రామానికి కాపలాగా ఉండే ఆ ఈశ్వరుని పేరు మీదనే శివునూరు వెలిసింది. గ్రామంలో కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న అనంతరం గ్రామాన్ని చీనూరుగా పిలవడం ప్రారంభించారు.
శిథిలమైన శివాలయం ..
గ్రామ శివారులో ఉన్న పురాతన శివాలయం శిథిలమైంది. ఆలయ స్తంభాలు విరిగిపోయి పడిపోయాయి. చెట్లు, పొదలతో ఆలయ పరిసరాలు భయంకరంగా మారాయి. ఆలయ ప్రాంగణం, గర్భగుడిలోని విగ్రహాలు సైతం నేలకొరిగాయి. గ్రామ శివారులో మల్లన్నగుట్ట ఉంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో ఎడ్లబండ్లు తిప్పి ఉత్సవాలు నిర్వహిస్తారు.