హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏలమని బెదిరించి ఢిల్లీలో రూ.లక్ష వసూలు చేస్తున్న ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. సీబీఐ అధికారుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఎంపీ మాలోతు కవిత పీఏగా చెప్పుకొన్న రాజీవ్ భట్టాచార్య మార్చి 15న మన్మీత్సింగ్ లాంబాకు ఫోన్చేసి ఢిల్లీ న్యూగుప్తా కాలనీలోని ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని బెదిరించాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) అధికారులు ఆ ఇంటిని కూలగొట్టకుండా తాము చూసుకుంటామని, అందుకోసం రూ.5 లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎంసీడీలోని అధికారులను ఒప్పించేందుకు ఎంపీ కవిత కో-ఆర్డినేటర్ శుభంగిగుప్తాతో టచ్లో ఉండాలని సూచించాడు. దుర్గేశ్కుమార్ అనే మరో వ్యక్తిని కూడా ఎంపీ పీఏగా బాధితుడికి పరిచయం చేశాడు. వరుస ఫోన్కాల్స్తో తీవ్ర ఒత్తిడి తెచ్చారు. చివరకు ముగ్గురు కలిసి రూ.లక్ష తీసుకుని పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై బాధితుడు మన్మీత్సింగ్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఢిల్లీలోని బీడీమార్గ్లోని సరస్వతి అపార్ట్మెంట్లో రూ.లక్ష తీసుకుంటుండగా రాజీవ్ భట్టాచార్య, శుభంగిగుప్తా, దుర్గేశ్కుమార్ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు అధికారులు తెలిపారు.
ఎంపీగా ఎన్నికైన నాటినుంచి ఇప్పటివరకు ఢిల్లీలో ఎవరినీ పీఏగా నియమించుకోలేదని ఎంపీ మాలోతు కవిత స్పష్టంచేశారు. రెండునెలల కిందటే ఢిల్లీలో క్వార్టర్స్ కేటాయించారని తెలిపారు. కేసులో పట్టుబడిన ముగ్గురిలో ఒకడైన దుర్గేశ్ను ఇటీవల డ్రైవర్గా నియమించుకున్నట్టు చెప్పారు. అతడికి క్వార్టర్స్లోని స్టాఫ్ క్వార్టర్ను ఇచ్చానని తెలిపారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గురువారం ఆమె మీడియాకు విడుదలచేసిన ఓ వీడియోలో కోరారు.