కోదాడ రూరల్, మార్చి29 : ఉపాధి హామీ పథకంలో భాగంగా కల్లాల నిర్మాణం జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. రైతులు పంట కోత అనంతరం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీలకు నూరుశాతం, మిగతావారికి 90శాతం సబ్సిడీతో ప్రభుత్వం కల్లాల నిర్మాణం చేపట్టింది. జిల్లావ్యాప్తంగా పంట కల్లాలు త్వరగా పూర్తిచేయాలనే కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, ఉపాధి హామీ, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. వచ్చే వానకాలం పంట నాటికైనా ప్రతి రైతు తన భూమిలో కల్లం ఏర్పాటు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,813 కల్లాలు మంజూరు కాగా ప్రస్తుతం 880 కల్లాల పనులు ప్రారంభించారు. వీటిలో 85 పూర్తయ్యాయి. కోదాడ మండల వ్యాప్తంగా 121 కల్లాలు మంజూరు కాగా, 15ప్రారంభించగా 4పూర్తయ్యాయి. కోదాడ క్లస్టర్ పరిధిలో 1,359 మంజూరవగా, 271కల్లాల పనులు ప్రారంభించారు. 44 పూర్తయ్యాయి.
కల్లాల కొలతలు ఇలా..
పంట కల్లాలను 3రకాల కొలతల్లో నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. 10.20మీటర్ల పొడవు, 7.5వెడల్పుతో నిర్మించుకునే కల్లానికి రూ.85వేలు, 8మీటర్ల పొడవు, 7.5మీటర్ల వెడల్పుతో నిర్మించే కల్లానికి రూ.68వేలు, 8.3మీటర్ల పొడవు, 6మీటర్ల వెడల్పుతో నిర్మించే దానికి రూ.56వేలు మంజూరు చేస్తారు. కల్లాల నిర్మాణం చేపట్టిన నాటి నుంచి విడుతల వారీగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
పంట కల్లాలను వినియోగించుకోవాలి
పంట కల్ల్లాలకు ప్రభుత్వం అందిస్తున్న నూరు శాతం సబ్సిడీని రైతులు వినియోగించుకోవాలి. ముఖ్యంగా వానకాలంలో పంట నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పంట కల్లాలకు సబ్సిడీ ఇస్తున్నది. రైతులు పంటను ఆరబెట్టుకునేందుకు కొండలు, బండలపైకి వెళ్లకుండా తమ సొంత పొలాల్లోనే కల్లాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-డాక్టర్ పెంటయ్య, ఏపీడీ
ఇవీ కూడా చదవండి..
ఆకాశంలో తేలుతున్న ఓడ.. ఫొటో వైరల్
కనిపించినవాళ్లను కాల్చేస్తా.. టిక్టాక్లో సైనికుల బెదిరింపు