జైపూర్: ఓ తహసీల్దార్ ఏసీబీకి భయపడి ఏకంగా రూ.20 లక్షల కరెన్సీ నోట్లను తగులబెట్టాడు. ఈ సంఘటన రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. అతని తరఫున ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పర్వత్ సింగ్ పట్టుబట్టాడు. దీంతో ఏసీబీ తన ఇంట్లోకి రాక ముందే అన్ని డోర్లు మూసేసి తన దగ్గర ఉన్న నోట్లన్నింటినీ తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ తగులబెట్టేశాడు. తాము కల్పేష్ ఇంట్లోకి వెళ్లడానికి ముందే అతడు అన్ని డోర్లు మూసేశాడని ఏసీబీ డీజీ బీఎల్ సోనీ వెల్లడించారు. ఎలాగోలా స్థానిక పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లామని, అయితే అతడు అప్పటికే కిచెన్లో లక్షల కరెన్సీ నోట్లను తగులబెట్టేశాడని ఆయన చెప్పారు. ఇంట్లో సోదాలు నిర్వహించగా.. రూ.1.5 లక్షలు దొరికినట్లు తెలిపారు. ఆర్ఐ పర్వత్ సింగ్తోపాటు తహసీల్దార్ కల్పేష్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు సోనీ చెప్పారు.