కొన్ని సినిమాలపై ముందు నుంచి కూడా ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలాంటి సినిమానే జాతి రత్నాలు. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో కొత్త దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన సినిమా జాతి రత్నాలు. ఈ చిత్రం మార్చి 11న మహా శివరాత్రి సందర్భంగా విడుదల కానుంది. అశ్వినీదత్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ నిర్మాతగా మారిపోయాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి నటించిన సినిమా కావడం కూడా జాతి రత్నాలుపై అంచనాలు పెంచేస్తుంది.
కచ్చితంగా ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. మరోవైపు ఈ ఏడాదిలోనే ఫన్ టాస్టిక్ ఎంటర్ టైనర్ ఇదే అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఫన్నీయెస్ట్ ఫిల్మ్ ఆఫ్ 2021 అంటూ ట్రైలర్ లోనే చెప్పేశారు. మరోవైపు దర్శకుడు అనుదీప్ మాటలు కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో బాధలు, ఏడుపులు ఉండవని.. రెండు గంటల పాటు నవ్వుకోవడమే జాతి రత్నాలు సినిమా అంటున్నాడు అనుదీప్. దాదాపు రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది జాతి రత్నాలు.
ఈ సినిమాపై ఉన్న హైప్.. అంచనాలు చూస్తుంటే పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా మూడు రోజుల్లోనే సేఫ్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. గురువారం విడుదల కాబట్టి లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. ముఖ్యంగా ఈ సినిమాపై ఓవర్సీస్లో భారీ హైప్ వచ్చేసింది. నాగ్ అశ్విన్, శేఖర్ కమ్ముల లాంటి దర్శకులకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. దాంతో ఈ వారం శ్రీకారం, గాలి సంపత్ సినిమాలతో పోలిస్తే మంచి అంచనాలతోనే జాతి రత్నాలు వస్తుంది. మరి ఈ హైప్తో రత్నాలు ఏం చేస్తారో చూడాలి.