హైదరాబాద్ : మైనారిటీల ఉన్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద ఎంపికైన 106 మంది లబ్ధిదారులకు మారుతి కార్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అందజేశారు. నగరంలోని నాంపల్లి హజ్ భవన్లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది అన్నారు. వారి సుపరిపాలనలో రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరుస్తోందన్నారు.
రాష్ట్రంలో మైనారిటీల భద్రత, సంక్షేమం, సముద్ధరణకు కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం వినూత్నమైనదన్నారు. ఇటువంటిది దేశంలో మరెక్కడా కూడా అమలు కావడం లేదన్నారు. నిరుద్యోగ యువత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వారి కుటుంబ జీవన పరిస్థితులు మెరుగయ్యేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. మైనారిటీలను ఉన్నత విద్యావంతుల్ని చేసేందుకు 204 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. 10 వేల మంది ఇమామ్, మౌజమ్ లకు ప్రతి నెల రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. మైనారిటీలందరూ సీఎం కేసీఆర్కు సంపూర్ణ మద్దతునిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్,ఎమ్మెల్సీ హసన్ ఎఫెండి, ఎమ్మెల్యే హుస్సేన్ మీరజ్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహ్మద్ సలీం, ఉన్నతాధికారులు షానవాజ్ ఖాసీం, కాంతివెస్లీ, యూనస్, స్థానిక కార్పోరేటర్ సురేఖ, హజ్ భవన్ మసీదు ఇమామ్ సాబేర్ పాషా తదితరులు పాల్గొన్నారు.