న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం, మధ్యదరా సముద్రాన్ని కలిపే సుయెజ్ కాలువలో ఓ కార్గో షిప్ ఇరికిన విషయం తెలుసు కదా. దీనివల్ల ఆ కాలువలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓడ అడ్డంగా ఉండటంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మిగతా ఓడలు వెళ్లే వీలు లేకుండా పోయింది. ఇప్పటికే ఈ ఓడ ఇలా ఇరుక్కొని నాలుగు రోజులు అవుతోంది. దాని అడ్డు తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది కొన్ని వారాలు కూడా పట్టవచ్చన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రోజూ వేల కోట్ల వాణిజ్యం
యూరప్, ఆసియా మధ్య సరుకుల రవాణాకు ఈ సుయెజ్ కాలువ షార్ట్కట్గా పని చేస్తుంది. ప్రతి రోజూ ఈ కాలువ ద్వారా సుమారు వెయ్యి కోట్ల డాలర్ల విలువైన సరుకులు రవాణా అవుతాయంటేనే దీని ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఆ కార్గో ఓడ అడ్డు తొలగించడానికి ఎన్ని రోజులు పడితే అంత ఆర్థిక నష్టం తప్పదు. మొత్తం ప్రపంచ వాణిజ్యంలో సుమారు 10 శాతం ఈ 193 కిలోమీటర్ల పొడవైన సుయెజ్ కాలువ ద్వారానే రవాణా అవుతుంది. ఈ కాలువ లేకపోతే ఆసియా నుంచి యూరప్ వెళ్లడానికి ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మొత్తం రవాణాలో ప్రస్తుతం కాలువలో ఇరుక్కున్నటు వంటి కంటైనర్ నౌకలదే నాలుగో వంతు. ప్రతి రోజూ 120 కోట్ల టన్నుల సరుకులు ఈ కాలువ ద్వారా అటూఇటూ ప్రయాణిస్తుంటాయి.
సరుకుల రవాణాపై ప్రభావం ఎంత?
ఆసియా నుంచి యూరప్కు సరుకుల రవాణా చేయాలంటే ఇదొక్క మార్గం తప్ప రైలు, రోడ్డు రవాణా వంటివి ఏవీ లేవని జార్జ్టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్న శరత్ గణపతి చెప్పారు. యూరప్లో తయారయ్యే అనేక వస్తువులకు ముడి సరుకులు ఈ కాలువ నుంచే వస్తాయి. ఇండియా నుంచి పత్తి, మధ్య ఆసియా నుంచి పెట్రోలియం, చైనా నుంచి ఆటో మొబైల్ విడి భాగాలు సుయెజ్ కాలువ ద్వారానే యూరప్ చేరతాయి. ఒక్క కాలువ బ్లాక్ అవడం ద్వారా అది వివిధ ఉత్పత్తుల తయారీపై ప్రభావం చూపిస్తుందని గణపతి అన్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడీ సుయెజ్ కాలువ బ్లాక్ అవడం ఈ కష్టాలను మరింత పెంచింది.