న్యూఢిల్లీ, జూన్ 2: రికార్డుస్థాయిలో నిధులు సమీకరించిన నేపథ్యంలో తమ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు పటిష్ఠంగావుందని, తమ మూడు వ్యాపార విభాగలైన జియో, రిటైల్, ఆయిల్ టూ కెమికల్స్ వృద్ధికి అవసరమైన నిధులు పుష్కలంగా వున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ తెలిపారు. టెలికం, డిజిటల్ వ్యాపార సబ్సిడరీ జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రిటైల్లో మైనారిటీ వాటా విక్రయం ద్వారా రూ.2 లక్షల కోట్లు సమీకరించామని, రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ.53,124 కోట్లు వచ్చాయంటూ బుధవారం విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదికలో అంబానీ వివరించారు. 2020-21లో ఫేస్బుక్, గూగుల్తో సహా వ్యూహాత్మక, ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ల ద్వారా జియో ప్లాట్ఫామ్స్ రూ.1,52,056 కోట్లు, రిలయన్స్ రిటైల్ రూ. 47,265 కోట్లు సమీకరించాయి. అలాగే తమ ఇంధన రిటైలింగ్ వ్యాపారంలో బ్రిటిష్ పెట్రోలియం రూ.7,629 కోట్లు పెట్టుబడి పెట్టిందని రిలయన్స్ అధినేత తెలిపారు. ఈ నిధులన్నింటితో రిలయన్స్ రుణరహిత కంపెనీగా రూపొందిందని, వ్యాపారాల నుంచి నగదు లభ్యత పెరిగిందని, తద్వారా బ్యాలెన్స్ షీట్ పటిష్ఠ పడిందని ఆయన వివరించారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ 7.8 బిలియన్ డాలర్ల (రూ.57,000 కోట్లు) దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ రుణాల్ని ముందస్తుగానే చెల్లించింది.