హైదరాబాద్: దేశీయంగా కొవాగ్జిన్ అనే కొవిడ్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ ఇక ఇప్పుడు తమ వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.65 కోట్ల గ్రాంట్తోపాటు రూ.1500 కోట్ల రుణం కూడా రావడంతో ఉత్పత్తిని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదికి 70 కోట్ల కొవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు భారత్ బయోటెక్ మంగళవారం వెల్లడించింది. క్రియాశీల వైరస్ వ్యాక్సిన్ల కంటే క్రియా రహిత వ్యాక్సిన్లు చాలా సురక్షితమైనా, వీటి తయారీ చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆ సంస్థ చెప్పింది. దీనివల్ల తమకు వచ్చే లాభాలు కూడా చాలా తక్కువని తెలిపింది.
ప్రత్యేకంగా రూపొందించిన బీఎస్ఎల్-3 వసతుల కారణంగా తాము తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతామని భారత్ బయోటెక్ చెప్పింది. ఇండియాలో ఇప్పటి వరకూ ఈ పద్ధతిని ఉపయోగించి వ్యాక్సిన్ తయారు చేయలేదని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే కొవాగ్జిన్ తయారీ కోసం ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (ఐఐఎల్)తో భారత్ బయోటెక్ చేతులు కలిపింది. టెక్నాలజీ బదిలీ కూడా సాఫీగా జరుగుతోందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం భారత్ బయోటెక్ నెలకు కోటి డోసుల కొవాగ్జిన్ను ఉత్పత్తి చేస్తోంది.
ఐఐఎల్తోపాటు హాఫ్కైన్ బయోఫార్మాసూటికల్ కార్పొరేషన్ కూడా కొవాగ్జిన్ను ఉత్పత్తి చేయనుంది. దీని కారణంగా కొవాగ్జిన్ ఉత్పత్తి మే-జూన్ నాటికి రెట్టింపు అవుతుందని, జులై-ఆగస్ట్ నాటికి 6 నుంచి 7 రెట్లు అవుతుందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న నెలల్లో భారత్ బయోటెక్ కాకుండా ఈ రెండు సంస్థలే నెలకు 3.5 కోట్ల మేర వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నాయి.