కొండాపూర్, జూలై 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరిగిపోతుందన్నవారితోనే ప్రశంసలు పొందేలా నేడు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కొండాపూర్లోని 8వ పోలీస్ బెటాలియన్లో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ ఔట్ పరేడ్) కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే పటిష్టమైనదిగా గుర్తింపు పొందిందని తెలిపారు. సీఎం కేసీఆర్, పోలీస్శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని చెప్పారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా నేడు 331 షీ టీమ్స్ పని చేస్తున్నాయని, ఉమెన్ సేఫ్టీ వింగ్ను ఏర్పాటుచేసి దేశానికే ఆధర్శంగా నిలిచామన్నారు. రూ.700 కోట్లతో పోలీస్ శాఖకు నూతన వాహనాల కొనుగోలు చేశామని, ఏదైనా ఘటన జరిగితే హైదరాబాద్లో 5 నిమిషాల్లో, జిల్లాల్లో కేవలం 8 నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకొంటున్నారని తెలిపారు.
పోలీస్ సేవలు మరింత పెంచేందుకు రాచకొండ, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్లో నూతన కమిషనరేట్లను ఏర్పాటుచేశామన్నారు. రూ.500 కోట్లతో హైదరాబాద్లో అధునాతన ఇంటిగ్రేటెడ్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నేరాలను అదుపుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశామని, దేశంలోనే మొదటగా పోలీస్స్టేషన్లకు నిర్వహణ చార్జీలను అందిస్తున్నామని వివరించారు. ఇప్పటికే 29 వేలమంది కానిస్టేబుల్, ఎస్సైల నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. శిక్షణ పూర్తిచేసుకొని కానిస్టేబుళ్లుగా సేవలందించేందుకు వెళ్తున్న 466 మందికి శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీజీ అభిలాష బిస్త్, డీఐజీ సిద్ధిఖీ, ఇతర బెటాలియన్ కమాండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.