ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక పూట తింటే, ఒక పూట పస్తులుండాల్సిన పరిస్థితి. సొంతూర్లో బతుకుదామంటే వ్యవసాయానికి నీళ్లుండేవి కావు, కష్టపడి పనిచేద్దామంటే పని దొరికేది కాదు. గత ప్రభుత్వాలు ఎన్నడూ కడుపు నిండా తిండి పెట్టలేదు, చేతి నిండా ఉపాధి కల్పించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రోజులు మారాయి. అప్పుడు కష్టపడిన వాళ్లు నేడు రెండుచేతులా సంపాదిస్తూ ఎవరిపై ఆధారపడకుండా దర్జాగా బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో గులాబీ జెండా గుబాళించి ఏడేండ్లే అయినా, రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎనలేని మార్పునకు కారణమైంది.
ప్రజలతో పాటు కేసీఆర్ వెంట నడిచే గులాబీ సైన్యం చాలా పటిష్టమైనది. ఈ సైన్యానికి రెండు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ‘ఒకే ఒక్కడు’గా మొదలై నేడు 60 లక్షలకు పైగా సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీగా ఎదిగిందీ తెలంగాణ రాష్ట్ర సమితి. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా, అందుబాటులోఉంటూ న్యాయం చేస్తున్నారు కేసీఆర్. పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపునూ కల్పించారు.
ఆర్ఎస్ జెండా.. కేసీఆర్ అండా తెలంగాణకు ఎల్లవేళలా ఉండాలని తెలంగాణ ప్రజలు ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. పరాయి పాలకులు కులాలు, మతాలు, వర్గాలు పేర అందినకాడికి దండుకుపోయి తెలంగాణ ప్రాంతానికి ఉత్త చిప్ప మిగిల్చారు. ఆంధ్రా వలస పాలకుల మోసాలను దగ్గర్నుంచి చూసినవాళ్లమే. కానీ ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులూ మారాయి. దోచుకోవడమే తెలిసిన నాయకులను తుంగలో తొక్కి తనను కాపాడే నాయకులకు పట్టం కట్టింది తెలంగాణ నేల. ఈ మట్టిని ముద్దాడే ఒక రైతుబిడ్డకు, జనాల కోసమే పుట్టిన ఒక నాయకుడికి, ఆ భగవంతుడు సృష్టించిన కారణజన్ముడికే పట్టాభిషేకం చేసి మురిసిపోతున్నది తెలంగాణ నేల.
రోజురోజుకు పేదరికం వైపు దిగజారుతున్న రైతు బతుకును, వ్యవసాయంపై పోతున్న నమ్మకాన్ని సీఎం కేసీఆర్ తిరిగి నిలబెట్టారు. బీడు వారిన నేలపై భగీరథ తపస్సును తలపించే కార్యాన్ని తలపెట్టి అతితక్కువ కాలంలో గోదారమ్మను తెలంగాణ అంతట పరవళ్లు తొక్కించిన ఘనత ఆయనది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారు. నాడు కడుపు చేత పట్టిన రైతే రాజుగా మారి నేడు మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కులం లేదు, మతం లేదు, దుక్కి దున్ని నాటువేసిన ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు అందించి చేయూతనిచ్చిన ఘనత కేసీఆర్ది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఆ రైతుకు ఒక్క గుంట భూమి ఉన్నా సరే, కాలం కాటు వేస్తే రూ.5 లక్షల బీమా అందించి ఆ రైతు కుటుంబానికి ధీమా ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది.
భావి పౌరులకు బడులే భరోసా అని నమ్మిన నేత కేసీఆర్ గురుకులాలను ఏర్పాటుచేశారు. తాము చదువుకోకపోయినా తమ పిల్లల జీవితాలైనా బాగుపడాలని పేద తల్లిదండ్రులు భావిస్తారు. పేద కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే స్థాయిలో గురుకులాలను సృష్టించి భరోసా కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుండా నాణ్యమైన విద్యతో పాటు సమాజంలో హుందాగా బతుకగలిగే ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నది. భావితరాలకు సేవచేసే పౌరులుగా తీర్చిదిద్దుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. కుల, మతాలకతీతంగా ‘ఏ కులం నీది’ అని అడిగితే ‘నాది గురుకులం’ అని చెప్పే సంస్కృతి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.
కులమతాల రంగు పూసుకొని రాజకీయాలు చేసేవారి మాయలో చిక్కుకొని కొందరు తప్పుదోవ పడుతున్నారు. స్వార్థంతో పనిచేసే నాయకులకు కొమ్ము కాస్తూ మరికొందరు మానవత్వాన్ని మరుస్తున్నారు. కానీ, నా మతం మానవత్వం, నా కులం తెలంగాణకు అంకితం అని చెప్పే కేసీఆర్ అందరిదీ ఒకే జాతి, అది మానవ జాతి అని నిరూపిస్తున్నారు. ‘కష్టపడి పనిచేద్దాం- పేదరికాన్ని పారదోలుదాం’ అనే నినాదాన్ని తెలంగాణ ప్రజల లక్ష్యంగా మార్చి ఆ దిశగా రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కేసీఆర్. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ, బీద ప్రజల బాధలు మాత్రం తీరలేదు. వారి పరిస్థితులూ మారలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే, కొత్త రాష్ట్రంలో పాలనాపరమైన ఇబ్బందులు ఎన్నో ఉన్నా తొలిరోజు నుంచే పేద ప్రజల సంక్షేమానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వ్యూహరచన మొదలుపెట్టింది.
కేసీఆర్కు అయినవాళ్లంటూ ఎవరైనా ఉన్నారంటే అది పేద ప్రజలే. అందుకే పేద బిడ్డకు ‘కేసీఆర్ కిట్’ అయిండు. బడీడు పిల్లల చదువుకోసం గురుకులాలను నెలకొల్పి వారికి గురువయ్యిండు. నవ వధువుకు మేనమామై కల్యాణలక్ష్మి అందిస్తున్నడు. రైతుకు ‘రైతుబంధు’ అందిస్తూ రైతు బాంధవుడైతున్నడు. ఆసరా పింఛన్లు అందిస్తూ వృద్ధులకు పెద్ద కొడుకుగా భాసిల్లుతున్నడు.
ప్రజలతో పాటు కేసీఆర్ వెంట నడిచే గులాబీ సైన్యం చాలా పటిష్టమైనది. ఈ సైన్యానికి రెండు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ‘ఒకే ఒక్కడు’గా మొదలై నేడు 60 లక్షలకుపైగా సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీగా ఎదిగిందీ తెలంగాణ రాష్ట్ర సమితి. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా, అందుబాటులో ఉంటూ న్యాయం చేస్తున్నారు కేసీఆర్. పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపునూ కల్పించారు. సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పించి వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు. నేడు ప్రజలందరూ జయహో కేసీఆర్ అంటూ జేజేలు పలుకుతున్నారు.
(వ్యాసకర్త: న్యాయవాది, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి)
తాడూరి శ్రీనివాస్