ఖైరతాబాద్, అక్టోబర్ 9: ప్రతి ఆడపిల్ల ఏడాదికోసారి క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పరీక్షలతోపాటు ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రొమ్ము, ఇతర క్యాన్సర్ల బారినపడకుండా ఉండవచ్చని చెప్పారు. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం పీవీ నరసింహారావు మార్గ్లోని జలవిహార్ నుంచి పీపుల్స్ప్లాజా వరకు నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన వాక్ను వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలతతో కలిసి కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్పై మహిళలకు మరింత అవగాహన అవసరమని చెప్పారు. గతంలో 60 ఏండ్లు పైబడినవారికి క్యాన్సర్ వచ్చేదని, ఇప్పుడు 30 ఏండ్లలోపు వారికీ వస్తున్నదని తెలిపారు.
ముందే గుర్తిస్తే పూర్తి చికిత్స
క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే పూర్తిస్థాయి చికిత్స అందించవచ్చని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సయ్యద్ ముర్తజా రిజ్వీ చెప్పారు. ప్రభుత్వపరంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. డాక్టర్ జయలత మాట్లాడుతూ.. మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్య క్యాన్సర్ అని చెప్పారు. దేశంలో ఏటా 13.8 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు వస్తున్నాయని, అందులో 4.58 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. 40 ఏండ్లు దాటినవారు బరువును నియంత్రించుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, మద్య, ధూమపానం మానివేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్ర కోఆర్డినేటర్ జగన్నాథ్రెడ్డి, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన ఆర్ఎంవో నిర్మల, ప్రొఫెసర్ డాక్టర్ బెంజిమిన్, డాక్టర్ సంజీవని కుమారి, డాక్టర్ విష్ణుప్రియ, డాక్టర్ సంధ్యా, డాక్టర్ సురేశ్, శ్రీనిధి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.