కరీంనగర్ : పట్టణవాసుల అన్ని ప్రాథమిక సమస్యలనున దశల వారీగా పరిష్కరించనున్నట్లు కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు తెలిపారు. 54 వ డివిజన్లోని మంకమ్మతోటలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు మేయర్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం డివిజన్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించిన మేయర్ మరమ్మతు పనులను చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం కార్పొరేషన్ బాధ్యత అన్నారు. సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే సీసీ రోడ్ల పనులను 54 వ డివిజన్లో రూ .6 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. డివిజన్లోని రోడ్లు, డ్రైనేజీలు చాలా కాలం క్రితం వేయడంతో శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. కావునా మరమ్మతు పనులను చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. 52, 53, 56 వ డివిజన్లలో డ్రైనేజీలు, రోడ్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని, ఈ ప్రాంతంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కాశ్మీర్గడ్డ పార్కును ఆధునీకరించాలని తెలిపిన మేయర్ ఇప్పటికే రూ. 25 లక్షల విలువైన పనులకు టెండర్లు సైతం ఆహ్వానించినట్లు చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. పార్కులో రూ .12 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, కుర్చీలు, చిల్డ్రన్ ప్లేయింగ్ జోన్, పచ్చదనం అభివృద్ధి చేస్తామన్నారు. కాశ్మీర్గడ్డ రైతు బజార్ను కూడా అభివృద్ధి చేస్తామని మేయర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.