మహబూబ్నగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మండు వేసవిలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వాగులు, వంకలు జీవనదుల్లా పారుతున్నాయి. ఎగువన ప్రాజెక్టుల పరిధిలో వినియోగించుకున్న తర్వాత వృథాగా పోయే నీళ్లు, ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలతో చెక్ డ్యామ్లు కళకళలాడుతున్నాయి. కోయిల్సాగర్ నుంచి రామన్పాడు రిజర్వాయర్ వరకు పారే ఊకచెట్టు వాగు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నది. ఈ వాగుపై నిర్మించిన బండ్రవల్లి, లాల్కోట, అల్లీపూర్ చెక్డ్యామ్లు మత్తడి దుంకుతున్నాయి. వీటి పరిధిలోని బావులు, బోర్లు రీచార్జి అయి రైతుకు పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నాయి. రూ.4.90 కోట్లతో ఇటీవలే నిర్మాణం పూర్తయిన లాల్కోట చెక్డ్యామ్తో సుమారు 500 ఎకరాలను స్థిరీకరిస్తుందని నీటి పారుదలశాఖ డీఈ చంద్రుడు తెలిపారు.
రూ.40 లక్షల ఖర్చుతో 0.025 టీఎంసీ నీరు
కోదాడ- బళ్లారి హైవే విస్తరణ తర్వాత పాత బ్రిడ్జిని అలాగే వదిలేయకుండా కేవలం రూ.40 లక్షల ఖర్చుతో చెక్డ్యామ్గా మార్చేశారు. ప్రస్తుతం ఇది సుమారు 0.025 టీఎంసీ నీటి నిల్వతో కళకళలాడుతున్నది. దీని ద్వారా 500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించినట్టు అయ్యింది. బావులు, బోర్లు రీచార్జి అవుతున్నాయి. సీసీ కుంట మండలం అల్లీపూర్ చెక్డ్యామ్తో 650 ఎకరాలు సాగవుతుంది. 800 బోర్లు రీచార్జి అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రూ.332 కోట్లతో 64 చె డ్యామ్లు నిర్మిస్తున్నారు.