హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని జీనోమ్వ్యాలీలో ల్యాబ్స్పేస్ అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జి, సింగపూర్కు చెందిన లైట్హౌస్ కాంటన్ సంస్థ జీనోమ్ వ్యాలీలో వంద మిలియన్ డాలర్లు (రూ.740 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించాయి. 80:20 దామాషా ప్రకారం ఈ సంస్థలు పెట్టుబడి పెడతాయి. దాదాపు పది లక్షల చదరపు అడుగుల మేర ల్యాబ్స్పేస్ను అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఇవాన్ హో సంస్థ భారత విభాగం ఎండీ చాణక్య చక్రవర్తి, సీనియర్ ప్రతినిధులు శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సిన్హా.. బుధవారం వర్చువల్ పద్ధతిలో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. జీనోమ్వ్యాలీలోని ఎంఎన్ పార్కులో తమ పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. లైఫ్సైన్సెస్ రంగంలో ఒక ప్రముఖ కెనెడియన్ సంస్థ దక్షిణాసియాలో ఇంత భారీ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి అని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, లైఫ్సైన్సెస్ రంగ మౌలిక వసతుల కల్పనలో ఈ పెట్టుబడి ఒక మైలురాయిగా అభివర్ణించారు. జీనోమ్ వ్యాలీ దేశంలోనే అతిపెద్ద లైఫ్సైన్సెస్ రంగ పరిశోధన, అభివృద్ధి క్లస్టర్ అని పేర్కొన్నారు. ఈ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. తాజా పెట్టుబడి ఈ రంగానికి మరింత ఊతమిచ్చిందని ప్రశంసించారు. ఈ పెట్టుబడి ద్వారా జీనోమ్వ్యాలీలో లాబరేటరీ స్పేస్తోపాటు పరిశోధన, అభివృద్ధి, అనుబంధ మౌలిక వసతులు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కంపెనీ పెట్టుబడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్తోపాటు భారతదేశం.. ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని చాణక్య చక్రవర్తి ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.