హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు మారాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. రికార్డు షీట్లు లేకపోయినా వేరే పాఠశాలలో చేరవచ్చని వెల్లడించింది. దీనికి సంబంధించి ఇటీవలే కీలక ఆదేశాలు జారీచేసింది. స్కూళ్లు టీసీలు, రికార్డుషీట్లు ఇవ్వకపోయినా ఆయా విద్యార్థుల పేర్లను చైల్డ్ ఇన్ఫో నుంచి తొలగించాలని ఎంఈవోలకు ఆదేశాలిచ్చింది. జిల్లాల సరిహద్దులతో సంబంధం లేకుండా ఎక్కడైనా ప్రవేశాలు పొందేందుకు వీలు కల్పిస్తూ ఆయా విద్యార్థి వివరాలను డ్రాప్బాక్స్లో చేర్చాలని తెలిపింది. టీసీ కోసం దరఖాస్తు చేసుకుని 24 గంటలు దాటిందంటే ఆ తర్వాత ఎంఈవోలే బాధ్యులని స్పష్టంచేసింది. మారే సమాచారాన్ని ఎంఆర్సీల్లో పకడ్బందీగా నిర్వహించాలని ఎంఈవోలకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ప్రైవేటు స్కూళ్ల పేచీలు
స్కూల్ మారాలనుకొనే విద్యార్థులకు కొన్ని ప్రైవేట్ స్కూళ్లు టీసీలు ఇవ్వటంలేదు. ముఖ్యంగా ఫీజులు కడితేనే టీసీలు ఇస్తామని హెచ్చరిస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతో పేచీకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకొన్నారు. వాస్తవంగా 8వ తరగతి వరకు విద్యార్థులకు టీసీ అవసరం లేదు. కేవలం రికార్డుషీట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించవచ్చు.