వరంగల్ అర్బన్ : రాష్ట్రంలోని అనాథ బాల బాలికల స్థితిగతుల అధ్యయనంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం వరంగల్ అర్బన్ సుబేదారిలోని బాల సదన్ను సందర్శించింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, జల వనరులశాఖ చైర్మన్ వి.ప్రకాష్, జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, మేయర్ గుండు సుధారాణి బాల సదన్ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పిల్లల బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి పిల్లలతో కలిసి అల్పాహారం చేశారు. ఆహారం, అందుతున్న సదుపాయాలపై వాకబు చేశారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనాథ పిల్లల జీవితాల బాగుకు ఇంకేం చర్యలు చేపడితే బాగుటుందో నివేదిక ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలోని అనాథలకు ప్రభుత్వమే తల్లిదండ్రి అన్నారు. వారి సంపూర్ణ సంరక్షణ బాధ్యతలు తీసుకొని వారి భవిష్యత్తుకు భద్రత కల్పించాలని, ఆడపిల్లలకు పెళ్లి కూడా చేయాలని ఇటీవలి కేబినెట్ సమావేశంలో సీఎం కేసిఆర్ నిర్ణయించినట్లు మంత్రులు వివరించారు. అనాథలను ఆర్దికంగా బలోపేతం చేయాలనేది సీఎం ఆలోచన్నారు. రోడ్ల మీద ఏ పిల్లలు పనులు చేయకుండా వారిని ఆశ్రమాల్లో పెట్టి సంరక్షణ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి సలహాలు తీసుకుని ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు.
కమిటీ అధ్యయనం తర్వాత రాష్ట్రంలోని అనాథలకు మంచి పాలసీ రాబోతుందన్నారు. అనాథల జీవితాల్లో వెలుగు తెచ్చే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. దేశంలోనే ఇది ఒక ఆదర్శంగా ఉండబోతోందన్నారు. బాలికా సదనంలో ఆశ్రయం పొందుచున్న పిల్లలకు విద్యా వైద్య సౌకర్యాలు కల్పిస్తూ మానసిక వికాసం, సృజనాత్మకతను పెంపొందించుకొనుటకు వారిని వినోదం, విజ్ఞాన, విహార యాత్రలు, వీకెండ్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 59వ డివిజన్ కార్పొరేటర్ వసంత మహేందర్ రెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేనీ అనిల్ చందర్ రావు, సభ్యులు కే దామోదర్, పి సుధాకర్, ఆర్ జే డీఝాన్సీ లక్ష్మీబాయి, అర్బన్, రూరల్ జిల్లాల సంక్షేమ అధికారులు ఎం సబిత, ఎం శారద, తహశీల్దార్ గనిపాక రాజు, బాలికా సదనం సూపరింటండెంట్ కే వెరోనిక, డీసీపీవోలు పి సంతోష్ కుమార్, జీ మహేందర్ రెడ్డి, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఏ సతీష్ కుమార్, మరియు మెరుగు శ్రీనివాసులు,జీ సునీత, ఏ మాధవి, ఎం సుజాత, పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.