హైదరాబాద్ : పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల సమస్యపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సమావేశమై చర్చించింది. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, అజయ్ కుమార్ పాల్గొని చర్చించారు. రెండు గంటలకు పైగా పోడు భూముల సమస్యలపై చర్చించారు.
పర్యావరణ – పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అమలు, గిరిజనులు, గిరిజనేతరుల హక్కులను కాపాడటంపై కమిటీ క్షుణ్ణంగా చర్చించింది. ఈ నెల 24న మరోసారి సమావేశం కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, అటవీ శాఖ పిసిసీఎఫ్ శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు.