హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ పొడిగిస్తారా? సడలింపులు ఇచ్చి పాక్షికంగా అమలుచేస్తారా? కొనసాగిస్తే ఇంకెన్ని రోజులు? అనే ప్రశ్నలకు ఆదివారం సమాధానం దొరకనున్నది. కరోనా కట్టడి, లాక్డౌన్ అమలుపై రాష్ట్రమంత్రివర్గం భేటీ కానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో సమావేశమై కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నది. జూన్ నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగించాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. మరోసారి లాక్డౌన్ పొడిగిస్తే కరోనా నియంత్రణ పటిష్టంగా జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. సమావేశానికి హోంశాఖ, వైద్యారోగ్య, ఆర్థిక శాఖ అధికారులను పిలిచి మాట్లాడే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. కరోనా కట్టడికి ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న బెడ్లు, ఆక్సిజన్ సరఫరా, బ్లాక్ఫంగస్ చికిత్సపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో 600 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్లో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుకు సంబంధించిన ఫైలును మంత్రివర్గం ఆమోదించనున్నది. వైద్యసిబ్బంది నియామకం, జ్వరసర్వే, వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్లపై చర్చించనున్నారు. వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్ల ప్రక్రియలో ప్రీబిడ్డింగ్ సమావేశం కూడా పూర్తయ్యింది. కొవిషీల్డ్, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ తయారుచేసిన అంతర్జాతీయ కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. ఈ అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది.
వర్షాకాల వ్యవసాయ సీజన్ వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచటం, రైతుబంధు అందజేత తదితర అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది. ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చిందనే అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది.