హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, వానకాలం సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత, కరోనా, లాక్డౌన్ తదితర అంశాలపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద చెరువులు, కుంటలు 70% నీటితో కళకళలాడుతుండటం, వర్షాలు కూడా ముందుగానే కురిసే అవకాశాలు ఉండటంతో వానకాలం సీజన్ ఈసారి సమయానికే ప్రారంభం కానున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదిరోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేయాలని ఈ నెల 21న వరంగల్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశించింది. రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో వానకాలం సాగుపై దృష్టి కేంద్రీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డికి ఆదేశాలు జారీచేశారు. వానకాలం సీజన్లో రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 13.06 లక్షల క్వింటాళ్ల విత్తనాలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఈ ఏడాది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కురిసిన అకాల వర్షాల కారణంగా నాణ్యమైన సోయాబీన్ విత్తనం అందుబాటులో లేదని.. ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసుకోవాలని రైతులకు సూచించే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా ఎక్కడ ఏ పంట వేయాలి? ప్రాంతాల వారీగా, క్లస్టర్లవారీగా నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే అందుబాటులో ఉన్న ఎరువులు ఎంత? ఇంకా ఎంత రసాయన ఎరువులు అవసరం అవుతాయి? ఎన్ని టన్నుల ఎరువులను సిద్ధం చేసుకోవాలనే దానిపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఈ ఏడాది కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపనున్నారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలుచేస్తున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటి జర్వసర్వే నిర్వహిస్తున్నది. ఈ సర్వే మంచి ఫలితాలిస్తున్నది. ఇందులో లక్షణాలు కనిపించినవారికి వెంటనే మెడికల్ కిట్లు అందజేస్తున్నారు. లక్షణాలు కనిపించినవారిని వెంటనే హోంఐసొలేషన్ ఉంచి, ముందుగానే వైద్యం అందించడంతో ఇతరులను కాంటాక్ట్ కాకుండా కట్టడి చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ దవాఖానల్లో బెడ్ల సంఖ్యను పెంచింది. ఆక్సిజన్ కొరత లేకుండా రాష్ట్రంలోనే ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నది. మందులు, ఇంజెక్షన్ల కొరత రాకుండా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ముందుగా సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి అందించనున్నది. ఈలోగానే 45 ఏండ్లు పైబడిన వారందరికీ రెండో డోస్ ఇచ్చేందుకు వ్యాక్సినేషన్ను ప్రారంభించింది. కరోనా నుంచి కోలుకున్నాక కొంతమందికి వస్తున్న బ్లాక్ ఫంగస్పైనా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. బ్లాక్ ఫంగస్ వైద్యం కోసం బెడ్ల సంఖ్య 1500కు పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే దవాఖానల్లో వైద్య సిబ్బందిని నియమించుకొనేందుకు కూడా అనుమతి ఇచ్చారు. ఒకవైపు కరోనా రోగులకు వైద్యం అందిస్తూనే.. మరోవైపు వైరస్వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమలుచేస్తున్నారు. ముందుగా పదిరోజులు లాక్డౌన్ అమలుచేయాలని నిర్ణయించిన సర్కార్, దానిని 30వ తేదీ వరకు పొడిగించింది. లాక్డౌన్పై ఏమి చేయాలనే దానిపై క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయం పనులకు ఆటంకం లేకుండా 30 తర్వాత లాక్డౌన్ మరికొంతకాలం కొనసాగించాలా? అవసరం లేదా? అన్నదానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.