హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంగళవారం సమావేశం కానున్నది. ప్రగతిభవన్తో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ సమావేశంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ కొనసాగింపు, వానకాలం సాగు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. తెలిసిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీతో లాక్డౌన్ ముగుస్తున్నది. గతనెల 12 నుంచి పకడ్బందీగా అమలవుతున్న లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో దానిని మరికొద్ది రోజులు కొనసాగించాలా? వద్దా? ఒకవేళ కొనసాగిస్తే ఏవిధమైన చర్యలు చేపట్టాలి అనే అంశంపై క్యాబినెట్ చర్చించనున్నది. థర్డ్వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో దానిని సమర్థంగా ఎదురొనేందుకు వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధతపై తగు సూచనలు చేయనున్నది. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలే అత్యంత ప్రాధాన్యమని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్యసేవలు, ప్రైవేట్ దవాఖానల తీరుపై చర్చించనున్నారు. ఇప్పటికే అన్ని దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే కొత్తగా ఏర్పాటుచేస్తున్న 7 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూమి కేటాయింపులు తదితర అంశాలపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
సాగునీరు, వ్యవసాయ పనులు
రాష్ట్రంలో ప్రాజెక్టుల పనుల పురోగతి, తీసుకోవాల్సిన చర్యలు, వానకాలం సాగునీరు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నది. వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతుబంధు పథకం కింద రైతుఖాతాల్లో పెట్టుబడిసాయం జమ, విత్తనాలు, ఎరువుల లభ్యతతోపాటు.. కల్తీవిత్తనాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షిస్తుంది. వానకాలంలో ఏ భూము ల్లో ఏ పంట వేయాలన్న దానిపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రైతులు వరి పంటలు కాకుండా పత్తి, కంది తదితర లాభసాటి పంటలు వేయాలని సూచించింది. సాగునీరు సమృద్ధిగా ఉండటంతో ముందుగా నార్లు పోసేలా నీటి విడుదల చేపట్టడంపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
11 నుంచి డిజిటల్ సర్వేపై చర్చ
రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా కేంద్రీకరించింది. రికార్డులను ప్రక్షాళన చేసిన సర్కారు భూలావాదేవీల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్ను అమల్లోకి తెచ్చింది. ఇక రికార్డుల్లో ఉన్న భూమిలో ఇంచు కూడా తేడారాకుండా అక్షాంక్ష, రేఖాంశాలతో డిజిటల్ సర్వేచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 27 గ్రామాల్లో డిజిటల్ సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డిజిటల్ సర్వే చేయాల్సిన గ్రామాల ఎంపికను అధికారులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ సర్వే ప్రాముఖ్యాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
19 డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రారంభం 9న
రాష్ట్రంలో 19 జిల్లాల్లో ఏర్పాటుచేసిన 19 డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రారంభోత్సవం వాయిదాపడింది. ముందు గా అనుకున్న ప్రకారం సోమవారం కాకుండా ఈ నెల 9న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అన్నిచోట్ల మంత్రులు ఒకే సమయంలో పాల్గొని ఈ సెంటర్లను ప్రారంభించాలని సూచించారు. మంత్రులు లేనిచోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి ప్రారంభించాలన్నారు. డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రారంభోత్సవంలో ఎవరు ఎక్కడ పాల్గొనాలనే విషయంపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష
కరోనా కట్టడి చర్యలు, లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఖజానాకు రాబడి గణనీయంగా తగ్గింది. మరోవైపు వైద్యసేవలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సి రావడంతో ఖర్చు పెరిగింది. జూన్ 15 నుంచి రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ, ఉద్యోగుల వేతనాలు, పీఆర్సీ అమలు తదితర ఆర్థిక సంబంధ అంశాలు ప్రభుత్వం ముందున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది? తీసుకోవాల్సిన చర్యలేంటి? అనే అంశాలపై మంత్రివర్గ సమావేశం చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నది.