హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి విధించిన లాక్డౌన్ గడువు నేటితో ముగియనుంది. దీంతో లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా లాక్డౌన్ పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్డౌన్తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే..రాష్ట్రంలో ఇప్పటికే లాక్డౌన్ కఠినంగా అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతిండంలేదు.
వర్షాకాల వ్యవసాయ సీజన్ వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచటం, రైతుబంధు అందజేత తదితర అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది. ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చిందనే అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది.