దస్తురాబాద్, మే21 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట ధాన్యం కొనుగోళ్లలో ఆదర్శంగా నిలిచింది. నెల రోజుల వ్యవధిలోనే వంద శాతం ధాన్యాన్ని సేకరించింది. ఈ యాసంగిలో 500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా గత ఏప్రిల్ 21న గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో నెలలోపే 350 మంది రైతుల నుంచి 1149 టన్నుల ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లులకు తరలించారు. వీరిలో 278 మంది రైతులకు రూ.1.62 కోట్లు చెల్లించారు. మిగతా 72 మంది రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్టు పీఏసీఎస్ డైరెక్టర్ రామడుగు శైలజ తెలిపారు.