హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లకు ఆదరణ పెరుగుతున్నది. ఏడాది కాలం నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ తదితర యాప్ల ద్వారా క్రయ, విక్రయాలు జోరందుకొంటున్నాయి. గత కొన్ని నెలలుగా లోకల్ మార్కెట్లు, రిటైల్ స్టోర్లు, మాల్స్కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది ప్రజలు తమకు కావలసిన వస్తువులను ఈ-కామర్స్ యాప్ల్లో ఆర్డర్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి మరింత ఉద్ధృతమవడంతో ఇప్పుడు కూడా ఎవరూ ఇండ్ల నుంచి బయటికి వచ్చి వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం లేదని ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 358 జిల్లాల్లో 42 వేల మంది వినియోగదారుల నుంచి 1,30,000 అభిప్రాయాలు సేకరించిన అనంతరం ‘లోకల్ సర్కిల్స్’ తన సర్వే నివేదికను విడుదల చేసింది. ఈ-కామర్స్ వెబ్సైట్లు/యాప్స్ ద్వారా షాపింగ్ జరిపేందుకు 49 శాతం మంది ప్రజలు ప్రాధాన్యమిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. మాల్స్, మార్కెట్స్, స్థానిక రిటైలర్ల వద్ద కొనుగోళ్లు జరిపేందుకు 31 శాతం మంది.. హోం డెలివరీ ఆఫర్ చేస్తున్న స్థానిక రిటైలర్ల వద్ద కొనుగోళ్లు జరిపేందుకు 18 శాతం మంది మొగ్గు చూపుతున్నట్లు తేల్చింది.
ఈ కామర్స్ వేదికలనే ఎందుకు విశ్వసిస్తున్నారు?
సేఫ్ డెలివరీస్: 86 శాతం
కాంపిటీటివ్ ప్రైసెస్: 50 శాతం
ఈజ్ ఆఫ్ రిటర్న్: 48 శాతం
ప్రొడక్ట్ సెలక్షన్ : 46 శాతం
ఫాస్టర్ డెలివరీ: 45 శాతం
ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ రివ్యూస్: 45 శాతం
ఆన్లైన్లో ఎక్కువగా ఎలాంటి వస్తువులు కొంటున్నారంటే..
కిరాణ సామగ్రి
నిత్యావసర వస్తువులు: 69 శాతం
అధిక విలువైన వస్తువులు : 32 శాతం
మధ్యస్థ విలువ గల వస్తువులు: 54 శాతం
ఆన్లైన్వైపేఎందుకు మొగ్గుతున్నారు?
సురక్షితమైన డెలివరీలు, ధరల్లో పోటీ, ఈజీ ఆఫ్ రిటర్న్లాంటి అంశాలను దృష్టిలో ఉం చుకొని ఈ-కామర్స్సైట్ల ద్వారా వస్తువులను కొంటున్నట్టు చాలామంది ఈ సర్వేలో స్పష్టంచేశారు. పెద్ద వస్తువులు, విలువైన బ్రాండ్లను ఆన్లైన్లో కొనడమే మంచిదని, అంతేకాకుండా అధిక పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేసేందుకు కూడా ఇదే ఉత్తమ మార్గమని వారు చెప్తున్నారు.
సర్వేలో పాల్గొన్న వారిలో 33 శాతం మంది ఏ వస్తువునైనా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారానే కొంటున్నట్లు తేలింది. గతేడాది నుంచి తాము కొనుగోలు చేసిన వస్తువుల్లో 75 శాతం వస్తువులను ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ నుంచే కొనుగోలు చేసినట్లు 25 శాతం మంది చెప్పారు. వర్క్ఫ్రమ్ హోం, ఆన్లైన్ స్కూలింగ్తో ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో చాలా మంది తమకు కావాల్సిన వస్తువులను ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. ప్రజలు ఆన్లైన్లో కొనుగోలుచేసే వస్తువుల్లో ఎక్కువగా కిరాణా సామగ్రి, వెల్నెస్/ఫిట్నెస్ ప్రొడక్ట్స్, మాస్క్లు, శానిటైజర్లు, ఉంటున్నాయని అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.