జంతుశాస్త్ర విభాగం దగ్గర ఏర్పాటు
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా క్షీణించిపోయిన సీతాకోకచిలుకల సంఖ్యను పెంచడంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రారంభించింది. జంతుశాస్త్ర వి భాగం చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎం మాధవి నేతృత్వంలో కొవి డ్ ముందు, తర్వాత సీతాకోకచిలుకల వైవిధ్యంపై సర్వే నిర్వహించారు. నిజాంకాలేజ్తోపాటు ఓయూ పరిసరాల్లో సీతాకోకచిలుకల సంఖ్య గణనీయంగా తగ్గడాన్ని గుర్తించా రు. ఇందుకు ప్రధాన కారణం సీతాకోకచిలుకల నివాసాలు దెబ్బతినడమని నిర్ధారించారు. పరిశోధకులు పలు జిల్లాల్లో వివిధ రకాల సీతాకోకచిలుకల వివరాలను నమోదు చేశారు. ఉస్మానియా క్యాంపస్లో సీతాకోకచిలుకల వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి ఓ తోటను తీర్చిదిద్దాలని వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ మద్దతుతో సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకాంతస్, అసిస్టాసియా, బార్లేరియా, డిప్టెరాకాంతస్ తదితర వృక్షజాతులతో సీతాకోకచిలుకల కోసం తోటను పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.