తిరువనంతపురం : కేరళ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. 20 వేల కోట్లతో కోవిడ్ ప్యాకేజీని ప్రకటించారు. ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సవాళ్లను పరిష్కరించేందుకు కోవిడ్ ఉద్దీపన ప్యాకేజీని వినియోగించనున్నట్లు ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ తెలిపారు. 18 ఏళ్ల వయసు దాటిని వారికి ఉచితంగా కోవిడ్ టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా వెయ్యి కోట్లు కేటాయించారు. ఉచిత వ్యాక్సినేషన్కు కావాల్సిన వసతులు, పరికరాల సదుపాయాల కోసం అదనంగా మరో 500 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు 20వేల కోట్లు కేటాయించిందని, దాన్ని సంపూర్ణంగా వాడినట్లు ఆయన తెలిపారు. సెకండ్ కోవిడ్ బడ్జెట్తో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఆహారం అందేలా చేస్తామన్నారు. మహమ్మారిని అదుపులోకి తెచ్చి.. మూడవ వేవ్ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ నుంచి తేరుకున్న తర్వాత కొత్త ఆదాయ వనరులపై దృష్టి పెడుతామని మంత్రి చెప్పారు. తల్లితండ్రులు కోల్పోయిన చిన్నారుల కోసం 5 కోట్ల నిధిని కేటాయించామని, ప్రతి చిన్నారికి 3 లక్షలు ఇస్తామన్నారు.