ఖైరతాబాద్, అక్టోబర్ 11: దసరా షాపింగ్ బొనాంజా పేరిట నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు నిర్వహించిన పదిరోజుల పండుగ ఆహ్లాదంగా ముగిసింది. సోమవారం సాయంత్రం టూరిజంప్లాజా వద్ద బంపర్ డ్రా విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వైస్ ప్రెసిడెంట్ డీ చిరంజీవులు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్రెడ్డి, సెలెక్ట్ మొబైల్స్ ఎండీ వై గురు, కేఫ్ నిలోఫర్ వ్యవస్థాపకుడు బాబూరావు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా డాట్సన్ కారును మెహిదీపట్నంకు చెందిన వీరపనేని లక్ష్మీనవ్య గెల్చుకొన్నారు. ద్వితీయ బహుమతిగా 32 ఇంచ్ల ఎల్ఈడీ టీవీని శ్రీవాణి, తృతీయ బహుమతిగా రెడ్మీ నోట్ 9 ఫొన్ను సాయికుమార్రెడ్డి గెలుపొందారు. అనంతరం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వైస్ ప్రెసిడెంట్ చిరంజీవులు మాట్లాడుతూ.. కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నామని, విజయానికి ఈ దసరా పండుగ నాంది కావాలని ఆకాంక్షించారు.
మహిళలు గెలవడం సంతోషకరం: సీపీ
తాను ఉదయం నిద్ర లేవగానే ముందుగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు చదువుతానని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ రెండు పత్రికలు నిర్వహించిన దసరా బొనాంజాలో మొదటి, రెండో బహుమతులను మహిళలు గెలువడం సంతోషకరమని పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా తాము నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్లో తెలంగాణ టుడే పాత్ర ఉన్నదని వెల్లడించారు. కేఫ్ నిలోఫర్ వ్యవస్థాపకుడు బాబూరావు మాట్లాడుతూ.. హైదరాబాద్లో 45 ఏండ్ల అనుభవంలో తెలంగాణకు చెందిన పేపర్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రకటనకర్తలకు, పాఠకులకు మధ్య వారధిగా పత్రికలు పనిచేస్తాయని చెప్పారు. వారి మధ్య అనుసంధానకర్త పాత్రను నమస్తే తెలంగాణ పోషించిందని అన్నారు. తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్రెడ్డి విజేతలకు, ముఖ్య అతిథులుగా హాజరైన సీపీ భగవత్, దర్శకుడు శేఖర్ కమ్ములకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో గాయకులు జేఎస్ కీర్తన, శ్రావణి, శ్రీనిధి, జీ అపర్ణ, శుశృత, మేఘన, ప్రజ్ఞా ఆలపించిన భక్తి గీతాలు తన్మయత్మంలో ముంచెత్తాయి.
అతిథులకు జ్ఞాపికల బహూకరణ
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రకటనకర్తలతో రూపకల్పన చేసిన ‘దసరా షాపింగ్ బోనాం జా’ విజయవంతానికి తోడ్పడిన సంస్థలకు జ్ఞాపికలు అందజేశారు. ఫ్రీడమ్ సంస్థ మార్కెటింగ్ డీజీఎం పీ చేతన్, కేఎల్ఎం నుంచి శ్రీనివాస్, సెలెక్ట్ మొబైల్స్ ఎండీ మురళి, సీఎంఆర్ సంస్థ సీఎండీ సత్యనారాయణ, నిలోఫర్ చైర్మన్ బాబూరావు, నిస్సాన్ నుంచి జీబీ ఆనంద్ (నిస్సాన్- డాట్సన్, ఏరియా సేల్స్ మేనేజర్), రవికాంత్, సీఈవో (లక్ష్మీ నిస్సాన్), రాజిరెడ్డి జీఎం (వైబ్రెంట్ నిస్సాన్), వరుణ్ మోటర్స్ జీఎం నీరజ్, కున్ హ్యుందాయ్ జీఎం పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ డీజీఎం యోగానంద్, బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ హెడ్ మన్మోహన్గుప్తా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాజేశ్, చందనా బ్రదర్స్ ఎండీ సురేశ్, చర్మాస్ మీడియా మేనేజర్ రమేశ్, తులసి హాస్పిటల్ చైర్మన్ జైరామ్రెడ్డి, కింగ్స్వేర్ నుంచి హర్మిందర్సింగ్, ఎ-1 టీ ఎండీ జాకీపటేల్, పీఎంఆర్ లా కళాశాల చైర్మన్ మోహన్రావు, ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ చైర్మన్ పాండురంగారావు, రామయ్య అకాడమీ చైర్మన్ లక్ష్మీనారాయణ, లాసా లమ్సా టీ ఎండీ అనీస్ అహ్మద్ జ్ఞాపికలు అందుకొన్నారు. మీడియా పార్ట్నర్లుగా వ్యవహరించిన టీన్యూస్ సీజీఎం ఉపేందర్, ఈడీ సురేశ్బాబు, డిజిటల్ మీడియా పార్ట్నర్ హైబిజ్ టీవీ ఎండీ ఎం రాజగోపాల్, క్రియేటివ్ పార్ట్నర్ హోప్ అడ్వైర్టెజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కే సునీత జ్ఞాపికలను అందజేశారు.
మాటల్లో చెప్పలేకపోతున్నా..
అబిడ్స్ చర్మాస్లో పిల్లలకు బట్టలు కొనుగోలు చేశా. కూపన్ పూర్తి చేసి, బాక్సులో వేశా. ప్రైజు వస్తుందని ఊహించలేదు. బంపర్ బహుమతి నాకే రావడం మాటల్లో చెప్పలేకపోతున్నా.. చాలా ఎక్సైటింగ్గా..హ్యాపీగా ఉన్నది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారికి కృతజ్ఞతలు.
– వీరపనేని లక్ష్మీనవ్య, మెహిదీపట్నం