ముంబై: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. భారత్లోనూ మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ భారీ ప్రాణ నష్టం కలిగించింది. ఇక మహారాష్ట్రలోనైతే కరోనా వైరస్ విలయతాండవమే చేసింది. దాంతో ఆ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో కన్నవాళ్లను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడం కోసం మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది.
కరోనా మహమ్మారి కారణంగా తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయిన పిల్లల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున వేయాలని నిర్ణయించింది. పిల్లల వయసు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారు ఆ నగదును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించింది. అదేవిధంగా తల్లి లేదా తండ్రిని మాత్రమే కోల్పోయిన పిల్లలకు రూ.2,500 చొప్పున అందించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి యశోమతి ఠాకూర్ స్వయంగా ప్రకటించారు.