కోయిలకొండ, జూన్ 10: పశువుల కొట్టంలోకి దూరి బర్రెలపై దాడి చేయబోయిన ఓ చిరుతకు చేదు అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా బర్రెలు ఎదురు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మహబుబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చోటుచేసుకున్నది. బూర్గుపల్లి మల్దేవరగుట్ట సమీపంలో రైతు నవాజ్రెడ్డి పొలం వద్ద పశువుల కొట్టంలో ఆరు బర్రెలు, దూడలు ఉన్నాయి. గురువారం ఉదయం 7గంటల ప్రాంతంలో చిరుత కొండ కిందకు వచ్చి పశువుల కొట్టంలో బర్రెలపై దాడి చేయగా అవి బెదిరి తాళ్లు తెంపుకొని ఒక్కసారిగా చిరుతపై కొమ్ములు, కాళ్లతో దాడి చేశాయి. దీంతో చిరుత ముందు రెండు కాళ్లు, నడుము భాగంలో గాయాలు కావడంతో కదలలేని స్థితిలో గట్టుకింద పడింది. రైతు నవాజ్రెడ్డి విషయం తెలుసుకొని పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారమిచ్చాడు. జిల్లా అటవీ అధికారి గంగిరెడ్డి ప్రత్యేక బృందాలను పంపించి చిరుతకు మత్తు మందు ఇచ్చి బోనులో నెహ్రూ జూపార్క్కు తరలించారు. గాయపడిన ఈ మగ చిరుత వయస్సు మూడేండ్లు ఉంటుందన్నారు.