యాదాద్రి, ఏప్రిల్12: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే పరమశివుడిని ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించారు.వేకువజామున బాలాలయంలో స్వామివారి కవచమూర్తులకు ఆరాధనలు జరిపి, పంచామృతాలతో నిజాభిషేకం నిర్వహించారు. అనంతరం తులసిఅర్చనలు జరిపి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీనరసింహుని బాలాలయంలో శ్రీసుదర్శన నారసింహ మహాయాగంలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. పరిమిత సంఖ్యలో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్యకల్యాణంలో పాల్గొన్నారు.
ఆస్థాన పరంగానే ఉగాది ఉత్సవాలు
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగే ఉగాది వేడుకలు ఆస్థాపరంగానే నిర్వహించనున్నారు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యం లో భక్తులకు అనుమతి నిరాకరించారు. మంగళవారం ప్లవనా మ సంవత్సరాన్ని పురస్కరించుకుని విశేష పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని స్థానిక సిబ్బందితో కలిసి శుద్ధి చేయించడంతోపాటు మామిడి తోరణాలను కట్టించారు. ఉదయం నిత్యకల్యాణం ముగిసిన అనంతరం మధ్యాహ్నం పంచాంగ పఠనం నిర్వహించనున్నారు. అనంతరం ఆస్థానపరంగా పూజలు నిర్వహించి ఉగాది పచ్చడి ఆల య ఉద్యోగులు, ఆచార్యులు, సిబ్బందికి పంపిణీ చేస్తారు.
స్వామివారి ఖజానాకు రూ. 5,04,305 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.5,04,305 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 25,498, రూ.100 దర్శనాలతో రూ. 2,000, వీఐపీ దర్శనాలతో రూ.7,800, కైంకర్యాల ద్వారా రూ. 400, సుప్రభాతంతో రూ.800, ప్రచారశాఖద్వారా రూ.5,400, క్యారీబ్యాగులతో రూ.1,300, వ్రతాలతో రూ.13,000, కల్యాణకట్టతో రూ. 17,720, ప్రసాద విక్రయాలతో రూ. 2,89,500, వాహనపూజలతో రూ.3,000, టోల్గేట్ ద్వారా రూ. 830, అన్నదాన విరాళంతో రూ.1,270, సువర్ణపుష్పార్చనతో రూ. 39, 216, యాదరుషి నిలయంతో రూ. 24,800, శివాలయం ద్వారా రూ. 616, పాతగుట్టతో రూ. 5,155, టెంకాయల విక్రయాలతో రూ.21,000, ఇతర విభాగాల ద్వారా రూ. 45,000 తో కలిపి స్వామివారికి రూ. 5,04,305 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు.