హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)/తుర్కయాంజాల్: ఆయిల్ పామ్ సాగుతో తెలంగాణలో బ్రౌన్ విప్లవం రాబోతున్నదని నాబార్డ్ చైర్మన్ చింతల గోవింద రాజులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రైతువేదికలను మినీ పార్లమెంట్ భవనాలుగా అభివర్ణించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దసంఖ్యలో ఏర్పాటుచేయడంలో ప్రభుత్వం చర్యలు అభినందనీయమని ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేటలో సేంద్రియ రైతు నాగరత్నంనాయుడు వ్యవసాయ క్షేత్రంలో సోమవారం కర్షక సేవా కేంద్రం సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు శిక్షణ కేంద్రం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. రైతు సంక్షేమానికి సబ్సిడీ రుణాలు అందిస్తూ రైతు అభ్యున్నతికి పాటుపడుతున్నదని కితాబిచ్చారు.
వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలి
రైతులు వరి సాగుతోపాటు ఇతర వాణిజ్య పంటల సాగుపై శ్రద్ధ చూపాలని నాబార్డ్ చైర్మన్ కోరారు. ఆయిల్ పామ్ పంటను సాగుచేస్తే రైతులు లాభాలబాటలో పయనిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం ఆయిల్ పామ్కు ఎంతో అనుకూలమని, రైతులకు కూడా మంచి లాభసాటి పంట అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పంటల సాగు కోసం రైతులను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. అంకుర సంస్థలతో తెలుగు రాష్ర్టాలు అనుసంధానం చేసుకుంటే రైతుల ఆదాయం భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, పంట సాగుకు సబ్సిడీ రుణాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ప్రతి శనివారం తమ వ్యవసాయ క్షేత్రంలో ఆసక్తి గల యువ రైతులకు వ్యవసాయ రంగం-సాగు పద్ధ్దతులపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు రైతు నాగరత్నంనాయుడు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ వీ ప్రవీణ్రావు, రాష్ట్ర నాబార్డ్ సీజీఎం వై కృష్ణారావు, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రాంరెడ్డి, పశువైద్య, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ వీ లక్ష్మారెడ్డి, రైతునేస్తం చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరావు, పలువురు యువ రైతులు పాల్గొన్నారు.