సిద్దిపేట, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వీణవంక: ఈటల రాజేందర్కు దమ్ముంటే, నియోజకవర్గ ప్రజలపై ప్రేముంటే .. ఢిల్లీ నుంచి హుజూరాబాద్ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ తేవాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సవాల్ విసిరారు. గడియారాలు, కుక్కర్లు, కుట్టుమిషన్లు, కుంకు మ భరిణెలు పంచి ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకోవడం అవివేకమని అన్నారు. ఆరుసార్లు కేసీఆర్ బొమ్మను చూసి కారు గుర్తుకు ప్రజలు ఓటేశారని.. తనను చూసే ప్రజలు అండగా నిలబడ్డారని ఈటల అనడం హాస్యాస్పదమని చెప్పారు. ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి.. హుజూరాబాద్లో గడియారాలు పంచడమే ఆత్మగౌరవమా అని నిలదీశారు. గులాబీ జెండా లేకుంటే ఎమ్మె ల్యే, మంత్రి అయ్యేవాడివా..?, నీకు జీవితం ఇచ్చింది టీఆర్ఎస్ జెండా కాదా అని సూటిగా ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలోని ఎలుబాక, కోర్కల్, మల్లన్నపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు సిద్దిపేటలో ఆదివారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. నువ్వు ఇచ్చే గోడ గడియారాలు వద్దని, కేసీఆర్ గుండెల్లో ఉంటామని హుజూరాబాద్ ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారన్నారు. ఈటల ఇచ్చిన గడియారాలను హుజూరాబాద్ ప్రజలు బండకేసి కొడుతున్నారని, ప్రలోభాలకు లొంగకుండా కేసీఆర్ చేసిన ప్రగతికి పట్టం కడుతారని స్పష్టంచేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఆరు నూరైనా ఈటల గెలిచే ప్రసక్తేలేదని చెప్పారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఏ ఊర్లోనైనా రూ.10 లక్షల విలువైన పనులు చేశాడా?.. రేపు రాజేందర్ గెలిచినా ఉద్ధరించేదేమీ లేదన్నారు. మంత్రిగా ఉండి హుజూరాబాద్కు ఏం చేయని ఈటల .. రేపు ఉప ఎన్నికలో గెలిచినా ప్రజలకు లాభం లేదన్నారు.
బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?
తెలంగాణకు ఏం చేసిందని బీజేపీకి ఓటెయ్యాలో చెప్పాలని మంత్రి హరీశ్రావు ఈటలను ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ ధరలు రూ.100 దాంటించినందుకు ఓటెయ్యాలా?, ఎరువుల సబ్సిడీలు తగ్గించి రైతులకు భారంగా మార్చినందుకు ఓటెయ్యాలా? అని నిలదీశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ, ఎల్ఐసీ, బెల్ తదితర కంపెనీలను ప్రైవేటుకు అమ్ముతున్నందుకు ఓటేయాలా అని దుయ్యబట్టారు. హుజూరాబాద్ భవిష్యత్తు, అభివృద్ధి కోసం ప్రజలు టీఆర్ఎస్కు అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వకుళాభరణం కృష్ణమోహన్రావు, జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్కిషన్రావు, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల, సీనియర్ నాయకులు తిరుపతిరెడ్డి, సాదవరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, సర్పంచులు కాంతరెడ్డి, మర్రి స్వామి, ఎల్లారెడ్డి, కోవాల్రెడ్డి, మదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన బుడిగజంగాల నేతలు
హుజూరాబాద్ టౌన్: తెలంగాణ బేడ బుడిగజంగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మౌటం రాంకుమార్, రాంచంద్రం ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు మంత్రి హరీశ్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. బుడిగజంగాల భవన్కు స్థలం, సొంత స్థలాలు ఉన్న వారికి డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.