ప్రత్యేక ప్రతినిధి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సెకండ్వేవ్లో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువగానే రాబడి సమకూరింది. జీఎస్టీ, ఐజీఎస్టీ, సీజీఎస్టీ ద్వారా మే నెలలో రాష్ర్టానికి దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయం వచ్చింది. లాక్డౌన్ సడలింపులు కొన్ని గంటలకు పరిమితమైనప్పటికీ అమ్మకాలు, కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. లాక్డౌన్ లేని సమయాల్లో కూడా జీఎస్టీ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.3 వేల కోట్ల వరకు రాబడి వస్తుంది. గత నెల 20 రోజులు లాక్డౌన్ ఉన్నప్పటికీ జీఎస్టీ రాబడిలో మార్పు కనిపించలేదు. వాస్తవానికి ఏప్రిల్ కంటే మే నెలలోనే రూ.200 కోట్ల అధిక రాబడి రావడం విశేషం. కాగా విలువ ఆధారిత పన్ను (వ్యాట్ ) ద్వారా మరో రూ.2 వేల కోట్లు, మద్యం అమ్మకాలద్వారా మరో రూ.2 వేల కోట్ల రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల రాబడిపై లాక్డౌన్ ప్రభావం పడింది. గత నెలలో 11 రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడంతో రాబడి బాగా తగ్గింది. రెండు రకాల రిజిస్ట్రేషన్ల ద్వారా మే నెలలో రూ.230 కోట్ల రాబడి వచ్చింది. సాధారణంగా ప్రతి నెల సగటున రూ.700 కోట్ల నుంచి రూ.900 కోట్ల రాబడి వస్తుంది. అంటే లాక్డౌన్ కారణంగా దాదాపు రూ.500 కోట్ల ఆదాయానికి గండిపడింది. రాష్ట్రంలో గత నెల 12 నుంచి లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో మే 30 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. కానీ ఈ నెల 1 నుంచి అడ్వాన్స్ స్లాబ్ విధానంలో ప్రతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో 24, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలలో 48 వరకు రిజిస్ట్రేషన్లను అనుమతినిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు, 530 తాసిల్దార్ కార్యాలయాల్లో ఆన్లైన్ స్లాట్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.