యాదాద్రి, అక్టోబర్ 23: యాదాద్రి ప్రధానాలయం చుట్టూ నిర్మించిన రాజగోపురాల ద్వారాలకు బంగారు వర్ణపు ఇత్తడి తొడుగుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 2,600 కిలోల ఇత్తడితో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలోగల పంచతల రాజగోపురాలకు గల దర్వాజలకు పద్మాలు, లతలతోపాటు శంకు చక్రనామాలతో కూడిన ఇత్తడి తొడుగులు జనగామ జిల్లా పెంబర్తికి చెందిన విశ్వకర్మ బ్రాస్, కాపర్, సిల్వర్ కోఆపరేటివ్ సొసైటీ స్వర్ణకారులు చేపట్టారు. ఇప్పటికే ప్రధానాలయానికి నిర్మించిన దక్షిణ, ఉత్తర భాగంలో గల దర్వాజలకు బిగింపు ప్రక్రియ పూర్తికాగా.. మిగతా ద్వారాలకు ఇత్తడి తొడుగుల పనులు తుది దశకు చేరుకున్నాయి. శనివారం పెంబర్తిలో జరుగుతున్న ఇత్తడి తొడుగుల పనులను ఆలయ ఈవో ఎన్ గీత పరిశీలించారు. పనుల తీరుతెన్నులను స్వర్ణకారులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో దర్వాజకు 36 పద్మాలను పొందుపరిచామని, పద్మాలతోపాటు పద్మాల చుట్టూ తోరణాలు వివిధ ఆకృతులతో తీర్చిదిద్దుతున్నామని స్వర్ణకారులు ఈవోకు వివరించారు.