హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దేవాలయాలు ఆధునికతవైపు అడుగులు వేస్తున్నాయి. గుడికి రాలేని భక్తులు లైవ్ వీడియోతో ఎక్కడినుంచైనా నేరుగా మూలవిరాట్టును దర్శించుకోవడంతోపాటు పూజలు, అర్చనలు చేయించుకొనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్లోని గణేశ్ టెంపుల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలుచేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ఈ సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఆలయ నిర్వహణను దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయం నుంచి పరిశీలించడంతోపాటు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ఆలయాల్లో భక్తులు అలసిపోకుండా క్యూలైన్లలో కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేములవాడ గుడిలో ఈ ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు చెప్పారు. ప్రధాన ఆలయాల్లో ఇప్పటికే హెడ్ కౌంట్ మిషన్లను అమర్చారు. దీనివల్ల భక్తులు ఎంతమంది వస్తున్నారనే కచ్చితమైన సమాచారం తెలుస్తుంది.
ప్రధాన దేవాలయాలనుంచి భక్తులకు తీర్థప్రసాదాలు తపాలా ద్వారా పంపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. భద్రాద్రి ఆలయం నుంచి తపాలా సర్వీసులో ఈ ఏడాది 25వేలమంది భక్తులు అక్షింతలు తెప్పించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ కార్పొరేట్ సంస్థలు సామాజికబాధ్యతగా వెచ్చించే నిధులను ఆలయాల అభివృద్ధికి సేకరించాలని దేవాదాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా ప్రముఖులు, పలు సంస్థలనుంచి రూ. 30కోట్లు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ నిధులతో ఆయా ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం సత్రాల నిర్మాణం, మంచినీరు, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు.